దీనిని ఏమనాలి?

Vizianagaram Ministers No Reaction On HRC Notice - Sakshi

జిల్లాలో సీజనల్‌ వ్యాధులతో జనం సతమతం

వరుస మరణాలతో బెంబేలెత్తిపోతున్న ప్రజలు

వ్యాధుల తీవ్రతను తొలుత లక్ష్యపెట్టని యంత్రాంగం

ముందస్తు ప్రణాళికలోనూ పూర్తిగా విఫలం

హెచ్‌ఆర్‌సీ నోటీసులు అందుకున్న జిల్లా అధికారులు

అయినా కానరాని జిల్లా మంత్రి ఆచూకీ

జ్వరం... ఇది సాదాసీదా అనారోగ్యం. చిన్నపాటి మందులతో పూర్తిగా నయం చేయొచ్చు. టైఫాయిడ్‌... మలేరియా... ఇలా ఎన్నో వైరస్‌ జ్వరాలను సైతం సునాయాసంగా అదుపు చేసిన ఘనత మన వైద్యరంగానిది. పూర్వం ఎప్పుడో జ్వరాలతో మరణాలు సంభవించినట్టు చరిత్రలో విన్నాం... మళ్లీ ఇప్పుడు అవే పరిస్థితులు జిల్లాలో సంభవిస్తుంటే విస్తుపోతున్నాం. ఒకరు కాదు ఇద్దరు కాదు... ఏకంగా ఒక గ్రామంలో తొమ్మిది మంది... జిల్లా వ్యాప్తంగా మరో డెభ్భై మంది మృత్యువాత పడితే... సర్కారు ప్రతినిధులైన జిల్లా మంత్రి, మాజీ కేంద్రమంత్రి ఎందుకో తేలిగ్గా తీసుకున్నట్టున్నారు. మనిషి ప్రాణాలు కోల్పోతే అదేమంత తీవ్రమైన అంశం కాదేమోనని భావిస్తున్నట్టున్నారు. మరి వారి వైఖరిని ఏమనాలి...?

సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లా రెండు నెలలుగా జ్వరాలతో సహవాసం చేస్తోంది. వరుస మరణాలతో తల్లడిల్లిపోతోంది. ఏ పల్లె చూసినా మంచం పట్టిన పిల్లలు, వృద్ధులు, అనే తేడా లేకుం డా అన్ని వయస్సులవారూ ముసుగేసుకుని కనిపిస్తున్నారు. రోజూ ఒకటో, రెండో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. ఇలా నెలరోజుల్లో దాదాపు 80మంది ప్రాణాలు వదిలారు. దీనినిమానవ హక్కుల కమిషన్, బాలల హక్కుల కమిషన్లు తీవ్రంగానే స్పందించాయి. వెంటనే జిల్లా అధికారులకు నోటీసులు ఇచ్చాయి. ఇంత జరుగుతున్నా జిల్లాకు చెం దిన రాష్ట్ర భూగర్భగనుల శాఖ మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావులో మాత్రం కొంచెమైనా చలనం లేదు. ఇంతవరకూ ఈ చావులను తీవ్రంగా తీసుకోలేదు. వ్యాధుల నియంత్రణ కోసం అధికారులతో సమీక్ష జరపలేదు. జనం కోసమే పార్టీ మారానని చెప్పుకునే ఆయన ఆ ప్రజలకు కష్టమొస్తే మాత్రం ముఖం చాటేశారు. ఇక మరో రాజు అశోక్‌దీ అదేతీరు.

‘ముందస్తు’ వైఫల్యం
సాధారణంగా సీజనల్‌ వ్యాధులపై అధికార యంత్రాం గం ముందస్తు ప్రణాళికలు తయారు చేస్తుంటుంది. అవసరమైన ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలం వచ్చేసరికే ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ జిల్లాలో ఆ ప్రయత్నంలో జిల్లా అధికారులు విషలమయ్యా రు. డ్రెయిన్లు, రహదారులు, పారిశుద్ధ్య నిర్వహణపై జాతీయ స్థాయిలో వచ్చే అవార్డులపైనే దృష్టి సారించా రు తప్ప వాస్తవ పరిస్థితులను పట్టించుకోలేదు. మరో వైపు పంచాయతీల్లో సర్పంచ్‌ల పదవీకాలం పూర్తయిం ది. ప్రత్యేకాధికారులను నియమించినా వారు ఇంత వర కూ గ్రామాలపై పూర్తిగా దృష్టిసారించలేదు. కొందరైతే ఇంకా గ్రామాల ముఖం కూడా చూడలేదు. అక్కడి పారి శుద్ధ్యం మెరుగుకు చర్యలు చేపట్టలేదు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టరే స్వయంగా అంగీకరిస్తున్నారు. పోనీ జ్వరాలు వ్యాపిస్తున్నప్పుడైనా తీవ్రతనుఅంచనా వేశారా అంటే అదీలేదు. వ్యాధుల తీవ్రతను అంచనా వేసి తగిన మందులు సమకూర్చడం, వైద్య సిబ్బందిని పెంచడం, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపరచడం వంటి చర్యలు తీసుకోలేదు. ఫలితంగా ప్లేట్‌లెట్స్‌ కొరత, వైద్యం సకా లంలో అందకపోవడం,పైపెచ్చు డెంగీ వ్యాధిని నిర్ధారిం చకపోవడం జిల్లాలో ఇన్ని చావులకు కారణమయ్యాయి.

‘హెచ్‌ఆర్‌సీ’నోటీసులు:
జ్వరం వస్తే మరణమనే పరిస్థితి ఇప్పుడు జిల్లాలో ఏర్పడటానికి కారణం ఏమిటనే చర్చ ఒకవైపు జరుగుతోంది. జిల్లాలో ఇప్పటి వరకూ దాదాపు 80 మందికిపైగా  జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రం మొత్తం మీద ఇన్ని చావులు ఎక్కడా లేవు. ఒక్క సాలూ రు మండలం కరాసవలస గ్రామంలోనే రెండు వారాల్లో 9 మంది చనిపోయారు. జిల్లాలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ డిమాండ్‌ చేసింది. టీవీ, పత్రికలు, సోషల్‌ మీడియా జిల్లా పరిస్థితిపై దు మ్మెత్తి పోస్తున్నాయి. సాలూరు ప్రభుత్వాస్పత్రిలో గిరిజ న బాలికలను వరుసగా కూర్చోబెట్టి సెలైన్లు ఎక్కించడంపై రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. బాలల హక్కుల కమిషన్‌ సభ్యులు స్వయంగా రంగంలోకి దిగి ఆస్పత్రిని, హాస్టల్‌ను సందర్శించారు. అసౌకర్యాలు వాస్తవమేనని తేల్చారు. అంతేకాకుండా మానవ హక్కు ల కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. సుమోటోగా తీసుకుని జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యారోగ్యాధికారులకు నోటీసులు జారీ చేసింది.

నేతలెవ్వరూ నోరు మెదపరే...
జిల్లాలో పరిస్థితి ఇలా ఉంటే కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు మోన్నామధ్య రాష్ట్ర మంత్రి కళావెంకట్రావు వచ్చినపుడు మాత్రమే ఆయనతో కలిసి బయటకు వచ్చారు. ఆ రోజు కూడా కళావెంకట్రావు కొద్దిగా జ్వరాలపై పెదవి విప్పారు గానీ అశోక్‌ పెద్దగా మాట్లాడింది లేదు. ఆయన నివాసం ఉంటున్న విజయనగరం పట్టణంలో వరుస చావులు సంభవిస్తున్నా, నవ వరుడు జ్వరం బారినపడి మరణించినా ఆయనలో చలనం లేదు. ఇక రాష్ట్ర మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు ఏదో చేసేస్తానంటూ పార్టీ మారి ఆయన జిల్లాకు చేసిందేమీ కనిపించలేదు. కనీసం జిల్లా ఇలా సీజనల్‌ వ్యా ధులు, మరణాలతో అల్లాడుతున్నప్పుడైనా ప్రజలకు ఆయన అండగా నిలబడి ధైర్యం చెబుతున్నారా అంటే అదీ లేదు. ఇంత వరకూ అధికారులతో సమీక్ష జరిపిందీ లేదు. అసలు వారి తీరును ఏమనుకోవాలన్నదే అంతుచిక్కడం లేదు. జిల్లాను పట్టించుకోని ఇలాంటి ప్రజాప్రతినిధులు అవసరమా.. అన్న ప్రశ్న తలెత్తుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top