
'ఏపీలో బీజేపీకి కొంత నష్టమే'
వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏపీలో బీజేపీకి కొంత నష్టమేనని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు.
విజయవాడ: వెంకయ్య నాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకోవడం ఏపీలో బీజేపీకి కొంత నష్టమేనని బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యను ఏపీ ప్రభుత్వం దృష్టికి తేవడంలో జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ సఫలమయ్యారని అన్నారు. పవన్ కళ్యాణ్కి ఏ నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ ఉందని వ్యాఖ్యానించారు.
మిత్రపక్షంతో కలిసిపనిచేస్తున్నా సొంతంగా బలపడాలని అనుకుంటున్నామని, బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని అమిత్ షా చెప్పారని ఆమె వెల్లడించారు. పార్టీల మధ్య పొత్తులు వ్యక్తుల మధ్య ఒప్పందాలు కాదని, పొత్తులపై ఎన్నికల సమయంలో కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తమ పార్టీ రాజకీయ లబ్ధి కోసం నిర్ణయాలు తీసుకోదని, ప్రజల సంక్షేమం కోసం సిద్ధాంతపరంగా నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు. ఏపీలో జరుగుతున్న పరిణామాల గురించి కేంద్రానికి చెబుతుంటామన్నారు.
సభలు, పాదయాత్రలకు అనుమతి నిరాకరించడం సబబు కాదన్నారు. ముద్రగడ పద్మనాభం పాదయాత్రను అడ్డుకోవడాన్ని ఆమె తప్పుబట్టారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడం సరికాదన్నారు. రిజర్వేషన్లు అనేవి ఒక పద్ధతి ప్రకారం ఇస్తారని, రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి ప్రకారం ముందుకెళితే కేంద్రం కూడా దృష్టి సారిస్తుందని పురందేశ్వరి తెలిపారు.