సమైక్యాంధ్ర పోరు@ 50 | united andhra movements successfully completed 50 days | Sakshi
Sakshi News home page

సమైక్యాంధ్ర పోరు@ 50

Sep 18 2013 12:09 AM | Updated on Jul 28 2018 3:21 PM

సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ ప్రభం జనం కొనసాగుతోంది. 49వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి.

 ఏలూరు, న్యూస్‌లైన్:
 సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమ ప్రభం జనం కొనసాగుతోంది. 49వ రోజైన మంగళవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపుమేరకు జిల్లాలోని అన్ని ప్రైవేటు ఆసుపత్రులను మూసివేసిన వైద్యులు ప్రజాపోరాటానికి సంఘీభావం తెలిపారు. రాష్ట్ర విభజన నిర్ణయూన్ని వ్యతిరేకిస్తూ పాలకొల్లు, నరసాపురం పట్టణాల్లో చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగులు మంగళవారం దీక్షలు చేపట్టారు. జెడ్పీ కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న ఎన్జీవోలకు సంఘీభావం తెలి పేందుకు వచ్చిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను సమైక్యవాదులు అడ్డుకుని స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా చేయూలని, చంద్రబాబుతో సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటింపచేసి ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చిం ది.
 
  భీమవరంలో ఎన్జీవోలు భిక్షాటన చేసి నిరసన తెలిపారు. మాల మహానాడు ఆధ్వర్యంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మావుళ్లమ్మ గుడి రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పాలకొల్లు  గాంధీబొమ్మల సెంటర్ వద్ద రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాలకొల్లు మండలం పూల పల్లిలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఇంటిని ముట్టడించారు. యలమంచిలి మండలం చించినాడ, దొడ్డిపట్లలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ చేపట్టిన సద్భావన పాదయాత్ర  ముగిసింది. నరసాపురం రాయపేటలో డాక్టర్ శిరిగినీడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో మహిళలు రోడ్డుపై కసరత్తులు చేసి నిరసన తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పోరాట సమితి ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. పండ్లు, పూల వ్యాపారులు, తోపుడు బళ్ల వర్తకులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్‌లో మానవహారం నిర్మించారు. తణుకు  తహసిల్దార్ హరిహరబ్రహ్మాజీ ఆధ్వర్యంలో కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద మోకాళ్లపై నిలబడి సమైక్యాంధ్ర నినాదాలు చేశారు. ఉపాధ్యాయులు, ఎన్జీవోలు గుంజీలు తీశారు. మునిసిపల్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పీహెచ్‌సీ ఏఎన్‌ఎంలు, ఇంజినీర్లు, న్యాయవాదులు, ఆర్టీసీ, జేఏసీ నాయకులు రిలే దీక్షల్లో కూర్చున్నారు. రాష్ట్రంలోని అందరి బతుకులు బాగుండాలని కోరుతూ తాడేపల్లిగూడెంలో విద్యార్థినులు బతుకమ్మను శిరస్సున ధరించి ప్రదర్శన చేశారు.
 
  అనంతరం బతుకమ్మ పాటలు పాడారు. ఉంగుటూరులో జాతీయ రహదారిపై ముస్లిం నమాజ్, మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. పెనుగొండ మండలం సిద్ధాం తంలో ఎరువులు, పురుగు మందుల డీలర్లు దీక్షల్లో పాల్గొన్నారు. నిడదవోలులో ఎస్‌కేవీడీ ప్రభుత్వ బాలికల డిగ్రీ కళాశాల, మోడరన్ రూఫ్, ప్రభుత్వ బాలిక ల జూనియర్ కళాశాల విద్యార్థులు రాస్తారోకో నిర్వహించి మానవహారం చేశారు. పెనుగొండ , మార్టేరు, ఆచంట, ఎ.వేమవరం, వల్లూరు గ్రామాల్లో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. చాగల్లులో కేంద్ర మం త్రుల మాస్కుల ధరించి ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రదర్శన చేపట్టారు. కొవ్వూరులో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తీన్‌మార్, గారడీ నృత్యాలతో ర్యాలీ చేశారు.  జంగారెడ్డిగూడెంలో ఆర్డీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు చేస్తున్న రిలే దీక్షలకు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు సంఘీభావం ప్రకటించారు. చింతలపూడిలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో  తోపుడు బండ్లపై పండ్లు అమ్మి నిరసన తెలిపారు. లింగపాలెంలో వికలాంగులు మౌన ప్రదర్శన చేశారు. జీలుగుమిల్లి మం డలం దర్భగూడెంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. కొయ్యలగూడెంలో టాక్సీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్‌జీవోల మానవహారం ఏర్పాటు చేశారు.
 
 వైసీపీ ఆధ్వర్యంలో...
 సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నాయి. నరసాపురంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కావలి నాని నాయకత్వంలో 20 మంది కూర్చున్నారు. పార్టీ తాడేపల్లిగూడెం సమన్వయకర్త తోట గోపి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు మంగళవారం 40వ రోజుకు చేరుకున్నాయి. తణుకు, ఉంగుటూరు, నిడదవోలు, కొవ్వూరు, భీమవరం పట్టణాల్లో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నారుు.

Advertisement
 
Advertisement
Advertisement