దూసుకొచ్చిన మృత్యువు | Two women killed in Tadepalligudem | Sakshi
Sakshi News home page

దూసుకొచ్చిన మృత్యువు

May 29 2015 2:22 AM | Updated on Sep 3 2017 2:50 AM

తాడేపల్లిగూడెం : ఆయిల్ ట్యాంకర్ ఆ అత్తాకోడళ్ల పాలిట మృత్యుశకటమైంది. జాతీయ రహదారి డివైడర్‌పై కూర్చున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు.

తాడేపల్లిగూడెం : ఆయిల్ ట్యాంకర్ ఆ అత్తాకోడళ్ల పాలిట మృత్యుశకటమైంది. జాతీయ రహదారి డివైడర్‌పై కూర్చున్న వారిపైకి లారీ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన గురువారం ఉదయం తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయరహదారిపై కమ్మ కల్యాణ మండపం వద్ద చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. తణుకు రూరల్ మండలం తే తలి గ్రామానికి చెందిన భూపతిరాజు సత్యనారాయణరాజు, అతడి కుమారుడు శివరామరాజు దంపతులు రెండు మోటార్ సైకిళ్లపై తేతలి నుంచి ద్వారకాతిరుమలకు కల్యాణం చేయించుకునేందుకు బయలుదేరారు. వారు తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి జాతీయ రహదారి కమ్మ కల్యాణ మండపం దగ్గరకు వచ్చేసరికి ఒక మోటార్ సైకిల్ వెనుక చక్రం పేలిపోయింది. దీంతో సత్యనారాయణరాజు భార్య ధనలక్ష్మి (45) , శివరామరాజు భార్య గీతా పావని (25)ని దింపి పంక్చర్ వేరుుంచుకొచ్చే వరకు డివైడర్‌పై ఉండాలని కూర్చోపెట్టారు.
 
 సుమారు పది అడుగుల వెడల్పు కలిగిన డివైడర్‌పై వారు కూర్చుని మాట్లాడుకుంటున్నారు. సత్యనారాయణరాజు తనతో పాటు ఉన్న కూతురు కొడుకు (మనుమడు) వర్మను తీసుకుని మెకానిక్ కోసం గ్రామంలోకి వెళ్లేందుకు రోడ్డుకు అటువైపునకు వెళ్లగా శివరామరాజు లఘుశంక తీర్చుకునేందుకు పక్కకు వెళ్లారు. ఈలోగా తణుకు నుంచి విజయవాడ వైపునకు అతివేగంగా వెళుతున్న ట్యాంకర్ అదుపు తప్పి డివైడర్‌పైకి ఎక్కి అక్కడే కూర్చొన్న ధనలక్ష్మి, పావనిలపై నుంచి దూసుకెళ్లింది. లారీ వారిని సుమారు 150 మీటర్ల దూరం వరకు ఈడ్చుకొని పోయింది. తీవ్రగాయాలపాలైన వారిద్దరు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ లారీని వదిలి పరారయ్యారు. శివరామకృష్ణంరాజు ఇచ్చిన ఫిర్యాదును పురస్కరించుకుని తాడేపల్లిగూడెం రూరల్ ఎస్సై వి.చంద్రశేఖర్ కేసు నమోదు చేశారు. మృతదేహాలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు .
 
 పెళ్లిరోజునే ఘటన
 శివరామరాజు, పావని దంపతుల పెళ్లిరోజు గురువారం కావడంతో కుటుంబ సభ్యులతో కలిసి ద్వారకాతిరుమల చినవెంకన్నను దర్శించుకుని కల్యాణం జరిపించుకునేందుకు ఉదయం ఇంటి వద్ద నుంచి మోటార్ బైక్‌లపై సంతోషంగా బయలు దేరారు. అప్పటివరకు సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ ప్రయూణిస్తుండగా మోటార్ సైకిల్ టైర్ పంక్చర్ కావడంతో ఆగాల్సి వచ్చింది. కళ్లెదుటే తమ భార్యలు అనంతలోకాలకు చేరడంతో ఘటనాస్థలంలో తండ్రీకొడుకుల రోదనలు చూపరులను కలచివేశాయి.
 
 తేతలిలో విషాదఛాయలు
 
 తేతలి (తణుకు) : పెదతాడేపల్లి అయిదో నంబర్ జాతీయరహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అత్తాకోడళ్లు మృతి చెందిన ఘటనతో తేతలిలో విషాదఛాయలు అలముకున్నాయి. గ్రామానికి చెందిన అత్తాకోడళ్లు భూపతిరాజు ధనలక్ష్మి ,భూపతిరాజు గీతాపావని దుర్మరణం పాలవడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. శివరామరాజు తణుకులో ఫొటోస్టూడియో నిర్వహించుకుంటూ తల్లిదండ్రులతోనే కలిసి జీవిస్తున్నాడు. అతడికి మూడేళ్ల కిత్రం గీతాపావనితో వివాహమైంది. వారికి పిల్లలు లేరు. ధనలక్ష్మికి గీతా పావని స్వయానా అన్నయ్య కూతురు కావడంతో ఆమెను కూతురు కంటే ఎక్కువగా అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. వీరి మృతిపై గ్రామ ప్రముఖులు సంతాపం తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement