ఒమన్ తీరంలోని హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై దాడి జరగడంతో మంటలు చెలరేగినట్లు బ్రిటీష్ నౌకాదళ అధికారులు మంగళవారం తెలిపారు. ట్యాంకర్పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. అమెరికా-ఇరాన్ మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.
యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు ట్యాంకర్ ఒమన్లోని లిమా సమీపంలో దక్షిణ దిశగా ప్రయాణిస్తుండగా.. దాని ఎడమ వైపు (పోర్ట్ సైడ్) భాగంలో ఈ క్షిపణి తాకింది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా పర్యావరణ నష్టం జరగలేదని పేర్కొంది. అలాగే ఆ ప్రాంతం గుండా వెళ్లే నౌకలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది.
దాడులకు ఇరానే కారణమని అమెరికా అధికారుల ఆరోపిస్తున్నారు. యాక్సియోస్ వార్తా సంస్థ కథనం మేరకు సోమవారం రాత్రి స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్లో ఇరాన్ సైన్యం.. వాణిజ్య నౌకలపై రెండు క్షిపణులను ప్రయోగించింది. రెండు నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని.. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
కాగా, హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సర్వీస్ చార్జీలు వసూలు చేయాలని ఇరాన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఒమన్ ప్రభుత్వంతో కలిసి ఇందుకు సంబంధించిన నిబంధనలను అమలు చేయనున్నట్లు వివరించింది. ఈ చార్జీలు అందరికీ ఒకేలా ఉండవని తెలిపింది. కష్టకాలంలో తమకు అండగా నిలిచిన మిత్ర దేశాలకు చార్జీల్లో రాయితీలు, మినహాయింపులు ఇస్తామంటూ ఇరాన్ ప్రకటించింది. చైనా రాజధాని బీజింగ్లో జరిగిన వరల్డ్ పీస్ ఫోరమ్ కార్యక్రమం వేదికగా ఇరాన్ రాయబారి అబ్దుల్ రజా రహ్మానీ ఫజ్లీ ఈ విషయం వెల్లడించారు.


