చమురు నౌక హైజాక్‌.. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో కలకలం | Piracy Returns To Gulf Of Aden, Oil Tanker Hijacked Off Yemen Coast Directed Towards Somalia | Sakshi
Sakshi News home page

చమురు నౌక హైజాక్‌.. గల్ఫ్ ఆఫ్ అడెన్‌లో కలకలం

May 3 2026 2:13 PM | Updated on May 3 2026 5:00 PM

Oil Tanker Hijacked Off Yemen Coast Directed Towards Somalia

అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో సముద్రపు దొంగల (పైరేట్స్) అలజడి మళ్లీ మొదలైంది. శనివారం గల్ఫ్ ఆఫ్ అడెన్ లోని యెమెన్ తీరానికి సమీపంలో 'యురేకా'అనే చమురు ట్యాంకర్ ను గుర్తు తెలియని దుండగులు హైజాక్ చేసినట్లు యెమెన్ కోస్ట్ గార్డ్ అధికారికంగా ధ్రువీకరించింది. యెమెన్ లోని షబ్వా ప్రావిన్స్ సమీపంలో నౌకలోకి చొరబడిన సాయుధ బృందం, దానిని తమ ఆధీనంలోకి తీసుకుని సోమాలియా తీరం వైపు మళ్లించినట్లు తెలుస్తోంది.

నౌక వివరాలు
మెరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ అందించిన సమాచారం ప్రకారం, హైజాక్‌కు గురైన 'యురేకా' టోగో దేశపు జెండాతో ప్రయాణిస్తున్న చమురు ఉత్పత్తుల ట్యాంకర్. మార్చి నెలాఖరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) లోని ఫుజైరా నౌకాశ్రయంలో ఈ నౌక చివరిగా ఉన్నట్లు రికార్డయ్యింది. యెమెన్ అంతర్జాతీయ గుర్తింపు పొందిన ప్రభుత్వానికి చెందిన కోస్ట్ గార్డ్ ఈ ఘటనపై స్పందిస్తూ.. నౌక ఉన్న ప్రాంతాన్ని గుర్తించామని, సిబ్బంది భద్రత కోసం, నౌకను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. అయితే, నౌకలో ఎంతమంది సిబ్బంది ఉన్నారు, వారు ఏ దేశస్థులు అనే వివరాలను గోప్యంగా ఉంచారు.

మళ్లీ పడగ విప్పుతున్న పైరేట్స్
2000వ సంవత్సర కాలంలో సోమాలియా తీరంలో పైరసీ అత్యంత ప్రమాదకరంగా ఉండేది. ముఖ్యంగా 2011లో గరిష్ట స్థాయిలో వందలాది దాడులు జరిగేవి. ఆ తర్వాత అంతర్జాతీయ నౌకాదళాల గస్తీ, కఠినమైన భద్రతా వ్యూహాల వల్ల దాడులు గణనీయంగా తగ్గాయి. కానీ, గత కొద్ది వారాలుగా ఈ ప్రాంతంలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకరంగా మారుతున్నాయి.

‘ఇటీవలి వారాల్లో హిందూ మహాసముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతంలో దాడులు పెరిగాయి. ఏప్రిల్ చివరలోనే మూడు దాడులు జరిగినట్లు మా సమాచార కేంద్రం గుర్తించింది’ అని ఈయూ నావికాదళం ఆపరేషన్ అట్లాంటా పేర్కొంది.

ప్రాంతీయ ఉద్రిక్తతలు
ప్రస్తుతం ఈ ప్రాంతంలో షిప్పింగ్ రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ మద్దతు ఉన్న శక్తులు, యూఎస్-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితుల వల్ల ఎర్ర సముద్రం, గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాల్లో నౌకల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ప్రస్తుత హైజాకింగ్ కు రాజకీయ ఉద్రిక్తతలతో సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవు. బదులుగా, ఇది కేవలం ధనార్జనే ధ్యేయంగా సాగే సముద్రపు దొంగల పనిగా భద్రతా నిపుణులు భావిస్తున్నారు. గత నెలలో సోమాలియాలోని పుంట్ ల్యాండ్ రాష్ట్రంలోని గరాకాడ్ ప్రాంతం నుండి పనిచేస్తున్న ఒక కొత్త పైరేట్ ముఠా మరొక ట్యాంకర్ ను స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుతానికి 'యురేకా' నౌకను సురక్షితంగా విడిపించేందుకు అంతర్జాతీయ నౌకాదళ సంస్థలతో సమన్వయం చేసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. సముద్ర మార్గాల్లో భద్రత మళ్లీ ప్రశ్నార్థకంగా మారడంతో అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement