శవ రాజకీయాలకు తెరతీసిన టీవీ 5, ఈటీవీ | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యను ‘ఇసుక’ మరణంగా చిత్రీకరించి..

Published Wed, Nov 6 2019 8:46 AM

TV5 And ETV Reporters Creates Fake News In Bapatla - Sakshi

బాపట్లటౌన్‌ : మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంటే దాన్ని ఇసుక కొరతకు ఆపాదించి టీవీ5, ఈటీవీ ప్రతినిధులు చేసిన  శవరాజకీయాన్ని మృతుడి కుటుంబ సభ్యులే బట్టబయలు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా బాపట్ల మండలంలోని భర్తిపూడి గ్రామంలో సోమవారం సాయంత్రం నలుకుర్తి రమేష్‌ (39) ఇంట్లోనే ఉరేసుకుని మృతి చెందాడు. విషయం తెలిసి అక్కడికి వెళ్లిన టీవీ5, ఈటీవీ ప్రతినిధులు శవరాజకీయం మొదలు పెట్టారు. ‘ఉరివేసుకొని చనిపోవడానికి కారణం ఇసుక లేకపోవడమేనని చెప్పండి.. మీ ఇంటికి ఎవరొచి్చనా ఇదే విధంగా చెప్పండి.. మేము కూడా ఇదేవిధంగా టీవీల్లో చూపిస్తాం. ఇలా చేస్తే మీకు రూ.5 లక్షలు డబ్బులొస్తాయి. లేకపోతే ఏమీ రావు’ అని చెప్పి ప్రలోభపెట్టారు. అలాగే ప్రచారం చేశారు.

అయితే రమేష్‌ కుటుంబ సభ్యులు మంగళవారం ఆ దుష్ప్రచారాన్ని ఖండించారు. రమేష్‌కు గత కొన్నేళ్లుగా ఫిట్స్‌ వస్తుండటంతో ఎక్కడపడితే అక్కడ పడిపోతూ ఉండేవాడని అతని సోదరుడు సురేష్‌ చెప్పారు. దీనికితోడు గత వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నాడన్నారు.ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. అసలు తన తమ్ముడు తాపీ పని ఏమీ చేయడని, బాగున్న సమయంలో పొలం పనులకే వెళ్లేవాడని సురేష్‌ వివరించారు. ఆ టీవీల ప్రతినిధులు డబ్బులు వస్తాయని ఆశ చూపడంతో మొదట అలా చెప్పామని, తప్పని తెలిసి ఇప్పుడు వాస్తవం చెబుతున్నామన్నారు.

Advertisement
Advertisement