రేపు తెలంగాణ బంద్ | tommorrow telangana bantha | Sakshi
Sakshi News home page

రేపు తెలంగాణ బంద్

Feb 10 2014 12:08 AM | Updated on Sep 4 2018 5:07 PM

సంపూర్ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 11వ తేదీ మంగళవారం తెలంగాణ బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.

 ఉస్మానియా విద్యార్థి సంఘాల పిలుపు
 సాక్షి, హైదరాబాద్: సంపూర్ణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 11వ తేదీ మంగళవారం తెలంగాణ బంద్‌కు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. అన్ని అధికారాలతో కూడిన హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల తెలంగాణను ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. ఆదివారం ఉస్మానియా వర్సిటీలో 20 విద్యార్థి సంఘాల నేతలు సమావేశమై, తెలంగాణ అంశంపై చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థి నేతలు కోట శ్రీనివాస్‌గౌడ్, ఆజాద్, సయ్య ద్ సలీంపాషా తదితరులు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు’లో ఎన్నో చిల్లులున్నాయని వ్యాఖ్యానించారు. గవర్నర్ చేతికి శాంతిభద్రతలను అప్పగిస్తే.. బానిసలుగా బతకాల్సి వస్తుందన్నారు.
 
  హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని, ఉమ్మడి ప్రవేశ పరీక్షలను కూడా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. పోల వరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో చేర్చడం కాదని, అసలు ఈ ప్రాజెక్టునే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక రాష్ట్రంలో ఏమైనా తేడాలు వస్తే.. తెలంగాణలో ఈ ప్రాంత ఎంపీలను అడుగుపెట్టనీయబోమని హెచ్చరించారు. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, వ్యాపారులు, విద్యాసంస్థలు బంద్‌కు సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఇదిలా ఉండగా, ఆంక్షల్లేని తెలంగాణ కావాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ నాయకులు కూడా 11న బంద్‌కు పిలుపునిచ్చారు. ఫ్రంట్ రాష్ట్ర నేతలు జయ, నర్సింగరావు, రాజా నర్సింహ, సంధ్యలు బంద్ విషయాన్ని వెల్లడించారు. టీ బిల్లులో యూపీఏ ప్రభుత్వం పూట కో షరతు పెడుతోందని, హైదరాబాద్ ఆదాయాన్ని సీమాం ధ్రకు పంచుతామంటే సహించేది లేదని అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement