తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ

తిరుపతి టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ - Sakshi


తిరుపతి: దివంగత ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ భార్య ఎం.సుగుణమ్మను తిరుపతి శాసనసభస్థానం టీడీపీ అభ్యర్థిగా పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రకటించారు. నారావారిపల్లిలో తన ఇంట్లో టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. నేతల అభిప్రాయాలను తెలుసుకున్న చంద్రబాబు సమావేశం అనంతరం సుగుణమ్మను టీడీపీ అభ్యర్థిగా ప్రకటించారు. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహణకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలును విడుదల చేసిన విషయం విదితమే. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 19న ప్రారంభమమై 27న ముగుస్తుంది. ఈనెల 30లోగా నామినేషన్‌లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 13న పోలింగ్, 16న ఓట్ల లెక్కింపు చేపట్టేలా షెడ్యూలును విడుదల చేశారు.



సొంతూర్లో సంక్రాంతి పండుగ జరుపుకోవాలన్న భావనతో నారావారిపల్లికి చేరుకున్న చంద్రబాబు బుధవారం రాత్రి టీడీపీ జిల్లా కన్వీనర్ గౌనివారి శ్రీనివాసులు, దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం.సుగుణమ్మ, కుటుంబ సభ్యులు, టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలను నారావారిపల్లిలోని తన ఇంటికి పిలిపించుకుని సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నిక, జిల్లాలో టీడీపీ స్థితిగతులపై ఆరా తీశారు. సమావేశంలో నేతల అభిప్రాయాలను తీసుకున్న చంద్రబాబు.. తిరుపతి టీడీపీ అభ్యర్థిగా ఎం.సుగుణమ్మ పేరును ప్రకటించారు. టీడీపీ అభ్యర్థిగా తనను ప్రకటించిన అనంతరం ఎం.సుగుణమ్మ విలేకరులతో మాట్లాడుతూ భర్త వెంకటరమణ ఆశయాల సాధన కోసం పని చేస్తానన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. టీడీపీ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపఎన్నికలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని అన్ని రాజకీయపార్టీల నేతలను కోరుతామని చెప్పారు.

 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top