తిరుపతి, చిత్తూరులో ఎక్కడి వక్కడే | Tirupati, Chittor anywhere shatters | Sakshi
Sakshi News home page

తిరుపతి, చిత్తూరులో ఎక్కడి వక్కడే

Aug 30 2013 5:05 AM | Updated on Sep 1 2017 10:14 PM

తిరుపతిని సమైక్యవాదులు దిగ్బంధించారు. ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు తిరక్కుండా గట్టి చర్యలు తీసుకున్నారు.

సాక్షి, తిరుపతి: తిరుపతిని సమైక్యవాదులు దిగ్బంధించారు. ద్విచక్ర వాహనాలు మినహా ఇతర వాహనాలు తిరక్కుండా గట్టి చర్యలు తీసుకున్నారు. వాహనాలు లేకపోవడంతో తిరుమల శ్రీవారి భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలిపిరి బస్టాండ్ శ్రీవారి భక్తులతో కిటకిటలాడింది. బస్సుల కోసం బారులు తీరారు. ఎండలో రోడ్డుపై గంటలు గంటలు వేచి ఉండటం కనిపించింది. ఎండకు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. తాగునీటికి, ఆహారానికి ఇబ్బందులు పడ్డారు.

క్యూ విడిచి వెళితే మళ్లీ చివర్లోకి వెళ్లాల్సి వస్తుందని భావించి గంటలపాటు లైన్లోనే నిల్చుండిపోయారు. తిరుపతికి వచ్చి వెళ్లే ప్రయాణికులకు, చిరు వ్యాపారులకు సైతం తిప్పలు తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ  ఏర్పాటు ప్రకటనకు నిరసనగా బుధ, గురువారాల్లో తిరుపతి, చిత్తూరులో రెండు రోజుల బంద్‌కు పిలుపునిచ్చారు. ఆ మేరకు మొత్తం 49 సంఘాల వారు ఒక్కటై బృందాలుగా విడిపోయి నగరాల్లో విస్తృతంగా పర్యటిస్తూ బంద్‌ను విజయవంతం చేసేందుకు కృషి చేశారు.

తిరుపతి, చిత్తూరు శివారు ప్రాంతంలో తమిళనాడు, కర్ణాటక వైపు వెళ్లివచ్చే వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు నగరాల్లో ఏ ఒక్క షాపునూ తెరవనివ్వలేదు. ఆస్పత్రులు, సినిమా హాళ్లు, విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు తాళాలు వేశారు. తిరుపతి కార్పొరేషన్ అధికారులు మున్సిపల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేఎల్.వర్మ ఆధ్వర్యంలో కుర్చీలను వెనక్కు తిప్పి తలపై పెట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సెంట్రల్ పార్క్ వద్ద మానవహారంగా ఏర్పడి ‘విభజనకు తెగబడితే.. కుర్చీలు తిరగబడతాయ్. కుర్చీలు పట్టుకు వేలాడకుండా ఉద్యమంలోకి రండి’ అంటూ పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement