ఏపీ, తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు లేనట్లే!

There is no bus service between AP and Telangana - Sakshi

సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపేందుకు బుధవారం హైదరాబాద్‌లో అధికారుల మధ్య జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతుండటం, టీఎస్‌ఆర్టీసీలో ఆపరేషన్స్‌ విభాగంలో ఓ అధికారికి కరోనా పాజిటివ్‌ తేలడంతో చర్చల్ని వాయిదా వేశారు. దీంతో ఇప్పట్లో ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే పరిస్థితి లేదని తెలుస్తోంది.  ఈ నెల 17న విజయవాడలో ఏపీఎస్‌ఆర్టీసీ, టీఎస్‌ఆర్టీసీ అధికారులు సమావేశమై రెండు రాష్ట్రాల మధ్య అంతర్రాష్ట్ర ఒప్పందంపై చర్చలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చలు వాయిదా పడటంతో బస్సు సర్వీసులను నడిపే అంశంపై సందిగ్ధత నెలకొంది. 

► కాగా, ఈ నెల 1 నుంచి 20 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ రోజుకు సగటున 3,266 బస్సు సర్వీసుల్ని నడిపింది. 11.03 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిరిగాయి. 
► గత 20 రోజులుగా రోజుకు రూ.2.43 కోట్లు ఆదాయం ఆర్టీసీ ఆర్జించింది. కిలోమీటరుకు రూ.22.06 మాత్రమే పొందింది. కరోనాకు ముందు రోజుకు రూ.12 కోట్ల ఆదాయం ఆర్టీసీకి వచ్చేది.

త్వరలో సిటీ సర్వీసులు 
► ఏపీఎస్‌ఆర్టీసీ త్వరలో సిటీ సర్వీసులు ప్రారంభించేందుకు నిర్ణయించింది. 
► విజయవాడ, విశాఖలో నడిపే సిటీ సర్వీసుల్లో ఎక్కడ్నుంచి ఎక్కడకు వెళ్లినా ఒకే రేటు వసూలు చేసేందుకు ఆర్టీసీ అధికారులు నిర్ణయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top