రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంగళవారం ఉష్ణోగ్రత 6.7 డిగ్రీలు నమోదైంది.
రికార్డు చలి!
Dec 11 2013 12:56 AM | Updated on Oct 17 2018 5:37 PM
తాండూరు, న్యూస్లైన్: రాత్రి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. మంగళవారం ఉష్ణోగ్రత 6.7 డిగ్రీలు నమోదైంది. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. రాత్రయితే చాలు రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో చిన్నారులు, వృద్ధులు ఇబ్బంది పడుతున్నారు. సోమ, మంగళవారాల్లో తాండూరులో నమోదైన 9.0, 6.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు భయపెట్టిస్తున్నాయి. ఒక్కసారిగా మూడు డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోవడం గడిచిన మూడేళ్లలో ఇదే తొలిసారని స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం అధికారులు చెబుతున్నారు.
నాలుగు రోజులుగా ఉష్ణోగ్రత పడిపోతూనే ఉంది. ఈనెల 7వ తేదీన 9.2, 8న 6.9, 9న 9.0, 10వ తేదీన 6.7 డిగ్రీలుగా నమోదైందని ఏఆర్సీ (వ్యవసాయ పరిశోధనా కేంద్రం) అధికారులు తెలిపారు. ఉదయం వేళలో మంచుదుప్పటి కప్పేయడంతో తొమ్మిది గంటలైనా చలి ప్రభావం తగ్గడం లేదు. చలితోపాటు ఉదయం గాలులు వీస్తున్నాయి. ఇక సాయంత్రం 5గంటల నుంచే చలి వణికిస్తోంది. ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశగా శీతల గాలులు వీయడం వల్లనే రాత్రి పూట ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత విపరీతంగా పెరుగుతోందని, ఇంకా చలి పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Advertisement


