246 మండలాలకు వడగాలుల హెచ్చరిక
18 జిల్లాల్లో తొలకరి జల్లులూ కరువు
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రమంతా తొలకరి వర్షాల కోసం ఎదురుచూస్తున్న సమయంలో..మళ్లీ ఎండ మండిపోతోంది. ఉత్తరాది నుంచి వస్తున్న వడగాలుల తీవ్రతతో 246 మండలాల్లో వాతావరణ శాఖ హీట్వేవ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో 43.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ముప్పై జిల్లాల్లో నలభై డిగ్రీలకు మించి పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
వచ్చే రెండు రోజులు కూడా వడగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే మృగశిర కార్తెలో కురిసే వర్షాలతో ఆరుతడి పంటలతో బిజీ కావాల్సిన రైతులు ఇంకా 18 జిల్లాల్లో తొలకరి వర్షాల కోసమే ఎదురుచూస్తున్నారు. కేవలం నాగర్కర్నూల్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఈ సీజన్లో సాధారణం కంటే అధిక వర్షం కురవగా..ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లోనే సాధారణ వర్షపాతం నమోదు అయింది. మిగిలిన అన్ని జిల్లాల్లో భారీ వర్షపాతం లోటు కనిపిస్తోంది. హనుమకొండ, సిద్దిపేట, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో చుక్క వర్షం కూడా కురవలేదు.


