హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
హైదరాబాద్ నగరంలోని ఇందిరాపార్కు వద్ద ఏపీ ఎన్జీవోలు నిర్వహిస్తున్న మహాధర్నా వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతుండగా, కొందరు తెలంగాణ వాదులు ప్రవేశించి ఆయనను స్టేజి మీద నుంచి కిందకు లాగేశారు. దీంతో అక్కడే భారీ సంఖ్యలో ఉన్న పోలీసులు జోక్యం చేసుకున్నారు. తెలంగాణ యువశక్తి సంస్థకు చెందిన ముగ్గురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడినుంచి తరలించారు.
అంతకుముందు మహాధర్నా సందర్భంగా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ధర్నా ప్రాంతమైన ఇందిరాపార్కు చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఏపీఎస్పీకి చెందిన 20 దళాలు, సీఆర్పీఎఫ్ కంపెనీ ఒకటి, ఆర్ఏఎఫ్ కంపెనీ ఒకటి, స్వాట్ దళాలు 6, 50 మంది ఎస్ఐలు, 15 మంది సీఐలు, 10 మంది డీఎస్పీలు, 100 మంది మహిళా పోలీసులను అక్కడ మోహరించారు.