మానస సరోవరం యాత్రలో చిక్కుకున్న తెలుగువారు
చిట్టినగర్ (విజయవాడ పశ్చిమ)/సాక్షి, అమరావతి: కైలాస్–మానస సరోవరం యాత్రకు వెళ్లిన విజయవాడ చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ఒగ్గు మురళీకృష్ణ, అతని సోదరుడు కోటేశ్వరరావుతో సహా దాదాపు వందమంది తెలుగువారు తుపానులో చిక్కుకున్నారు. విజయవాడ నుంచి దాదాపు నలభైమంది గత నెల 27వ తేదీన కైలాస్–మానస సరోవరం యాత్రకు బయలుదేరారు.
వీరంతా గత నెల 30వ తేదీ చైనా, నేపాల్ సరిహద్దులోని హిల్సా ప్రాంతం వద్ద చిక్కుకుపోయారు. సోమవారం సాయంత్రం స్నేహితులకు, బంధువులకు ఆయన అతి కష్టంమీద ఈ విషయాన్ని ఫోన్ద్వారా తెలియజేశారు. కాగా నేపాల్–చైనా సరిహద్దులోని మానస సరోవర్లో చిక్కుకున్న ఏపీకి చెందిన యాత్రికుల్ని క్షేమంగా స్వస్థలాలకు చేర్చే ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు ఏపీ భవన్ కమిషనర్ శ్రీకాంత్ను ఆదేశించారు.