ఏం మాయ రోగమొచ్చిందో..? | Telugu desam party | Sakshi
Sakshi News home page

ఏం మాయ రోగమొచ్చిందో..?

Feb 23 2015 2:26 AM | Updated on Aug 10 2018 5:38 PM

‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏం మాయరోగమొచ్చిందో తెలీదు గానీ.. ఆయన మాత్రం ఒక కొడుకుతోనే చాలించి, మన ల్ని మాత్రం పిల్లల్ని కనండి..

కదిరి: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఏం మాయరోగమొచ్చిందో తెలీదు గానీ.. ఆయన మాత్రం ఒక కొడుకుతోనే చాలించి, మన ల్ని మాత్రం పిల్లల్ని కనండి..కనండి అంటున్నారు’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ తీవ్ర విమర్శలు చేశారు.  సీపీఐ 22వ జిల్లా మహాసభల సందర్బంగా ఆదివారం కదిరి పట్టణంలో చేపట్టిన భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. సభలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి తీరు ఆ పార్టీ నాయకులకే నచ్చలేదన్నారు. ఎంపీ దివాకర్‌రెడ్డికి అస్సలు నచ్చడం లేదన్నారు.  కేంద్రంపై మెతక వైఖరితో మెలగాలని ఆయన తన పార్టీ ఎంపీలకు చెప్పిన మాటలను చూస్తే చంద్రబాబు ఎంత దిగజారి పోయారో అర్థం చేసుకోవచ్చునన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ చంద్రబాబు వెంట ఇప్పుడు అసలైన తెలుగుదేశం వారెవ్వరూ లేరన్నారు.
 
   నారాయణ, మురళీమోహన్, గళ్లా జయదేశ్ లాంటి కుబేరులే ఉన్నారన్నారు. జిల్లాలో 25 లక్షల ఎకరాలు సాగుభూమి ఉందన్నారు. ఈ ప్రభుత్వం మెడలు వంచైనా సరే అందులో 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా పోరాటం చేద్దామని చెప్పారు. సీపీఐ కదిరి డివిజన్ కార్యదర్శి వేమయ్యయాదవ్ మాట్లాడుతూ వలసల వల్ల గ్రామాల్లో ఇళ్లన్నీ తాళాలతో దర్శనమిస్తున్నాయని విచారం వ్యక్తం చేశారు.
 
 ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.  కార్యక్రమంలో సీపీఐ జిల్లా నేతలు రమణ, జాఫర్, మల్లికార్జున, కాటమయ్య, రాజారెడ్డి, అమీనమ్మ, కమలమ్మ, సంజీవప్ప, కేశవరెడ్డి, లింగమయ్య, నారాయణస్వామి, గోవిందు, పద్మావతమ్మ, శ్రీరాములు, రుద్రయ్య, ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాన్సన్, నరేష్, కేవై ప్రసాద్, రమణయ్య, స్థానిక నాయకులు ఇషాక్, కదిరప్ప, లియాకత్, రాజేంద్ర, రమేష్, మనోహర్, ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఎరుపెక్కిన పట్టణం : సీపీఐ మహాసభల సందర్భంగా పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణమంతా ఎరుపెక్కింది.  బహిరంగ సభకు జనం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పట్టణం హోరెత్తింది.
 
  ర్యాలీలో డ ప్పులు, చక్క భజనలు, లంబాడీల సాంప్రదాయ నృత్యాలు పట్టణ ప్రజలను బాగా ఆకట్టుకున్నాయి. జనసేవాదల్ పేరుతో శిక్షణ పొందిన కామ్రేడ్స్ కవాతు నిర్వహించారు. సుమారు కిలీ మీటరుకు పైగా ర్యాలీ కనబడింది. 3 రోజుల పాటు సాగనున్న జిల్లా మహాసభల్లో భాగంగా తొలిరోజు చేపట్టిన ర్యాలీ, బహిరంగ సభ సక్సెస్ కావడంతో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం కనబడింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement