
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టెలీమెడిసిన్ వ్యవస్థకు ఆదరణ పెరుగుతోంది. సుమారు నెల రోజుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్న వారి సంఖ్య 20 వేల మార్కు దాటింది. కరోనా వైరస్ కారణంగా లాక్డౌన్ నేపథ్యంలో ఫోన్ చేస్తే చాలు వైద్యులు సూచనలు, సలహాలతో పాటు మందులు ఇచ్చే కార్యక్రమానికి ఏప్రిల్ 14న ఏపీ సర్కారు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. 14410 నంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే చాలు తిరిగి మనకే ఫోన్ చేస్తారు.
ఆ తర్వాత వైద్యులు మన ఆరోగ్య సమస్యలు తెలుసుకుని మందులు సూచించడం, లేదంటే సలహాలు ఇస్తారు. ఈ 14410కు కాల్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారి సంఖ్య 20,256కు చేరింది. ఇందులో కోవిడ్ అనుమానిత లక్షణాలున్న వారుగా 348 మందిని గుర్తించారు. కోవిడ్ సమయంలోనే కాదు ఈ వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిన తర్వాత కూడా టెలీమెడిసిన్ వ్యవస్థను క్షేత్రస్థాయిలో విస్తరింపజేసి, వైద్యుల సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోంది.