
కొండలు తొలిచేస్తున్నారు..
అధికార పార్టీ అండదండలుంటే చాలు..అడ్డుకునే వారెవ్వరూ అన్నట్టుగా ఉంది కొంతమంది పారిశ్రామికవేత్తల తీరు.
కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు అడ్డుకున్న అటవీ శాఖ
విశాఖపట్నం: అధికార పార్టీ అండదండలుంటే చాలు..అడ్డుకునే వారెవ్వరూ అన్నట్టుగా ఉంది కొంతమంది పారిశ్రామికవేత్తల తీరు. ప్రైవేటు ల్యాండ్స్ ముసుగులో అటవీ, రెవెన్యూ భూములను కూడా దర్జాగా కబ్జా చేస్తున్నా అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. పాయకరావుపేట మండలం పీఎల్పురం రెవెన్యూ పరిధిలో అటవీ శాఖ బ్లాకు ఉంది. దీనిని ఆనుకుని రెవెన్యూ శాఖ అధీనంలో భారీ కొండలు ఉన్నాయి. వీటి మధ్యలో సర్వే నంబరు 171లో 560 ఎకరాలు భూమి సిద్దా రామదాసు పేరున ఉండేది. ఈ భూముల్లో ఉన్న కొబ్బరి, మామిడి, జీడిమామిడి తోటలున్నాయి. గతంలో 260 ఎకరాలు సినీ దర్శకుడు వి.వి. వినాయక్, మద్దిపాటి సుబ్బరావు కొనుగోలు చేశారని, వీరి నుంచి విశాఖ సమీపంలోని దివీస్ లేబరేటరీస్ కంపెనీ కొనుగోలు చేసిందని చెబుతున్నారు. ఈ భూములను చదును చేసే పనుల్లో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన కొండలపై ఉన్న భారీ వృక్షాలను సైతం నేలమట్టం చేస్తున్నారు.
కొండలు పైభాగంలో వరకూ పొక్లెనర్లతో చెట్లు తొలగించి చదును చేస్తున్నారు. ప్రైవేటు భూములు చదును చేసే పేరుతో కొండలను కూడా తొలిచేస్తున్నారు. ఈ కబ్జా వ్యవహారంపై స్థానికుల ఫిర్యాదు మేరకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎ.శ్రీనివాసరావు శుక్రవారం తమ సిబ్బందితో వచ్చి పనులు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. కంపెనీ వాళ్లవద్ద ఉన్న డాక్యుమెంట్లు పరిశీలించారు. దివీస్ కంపెనీకి చెందినదని చెబుతున్న భూములకు ఆనుకొని ఉన్న కొండప్రాంతమంతా అటవీశాఖకు చెందినదని ఎఫ్ఎస్వో పేర్కొన్నారు. అటవీశాఖకు చెందిన కొండపై భాగంలో చాలా వరకూ చెట్లు తొలగించి చదును చేసిన విషయం వాస్తవమేనన్నారు. అటవీశాఖకు చెందిన భూమి ఎంతవరకూ ఉందన్న విషయం పరిశీలన చేయాల్సి ఉందని చెప్పారు. చదును చేసిన భూమి వివరాలు ఫొటోలతో సహా అటవీశాఖ వెబ్సైట్లో పెట్టి పరిశీలిస్తామన్నారు. రెవెన్యూ శాఖకు చెందిన కొండ ప్రాంతభూములను సైతం ఆక్రమించుకునేందుకు యత్నించడాన్ని గుర్తించామని, వీటిని ఆ శాఖ అధికారులు కూడా పరిశీలన చేయాల్సి ఉందన్నారు. రెండు శాఖలు సంయుక్తంగా సర్వే చేస్తే తప్ప ఇక్కడ అటవీ, రెవెన్యూ శాఖలకు చెందిన భూముల సరిహద్దులేమిటి? మధ్యలో ప్రైవేటు భూములు ఎంత ఉన్నాయనేది నిర్ధారణ కావడం కష్టమన్నారు.
జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలతోనే ఇక్కడ ఈ కబ్జా తతంతం జరుగుతోందని, అందుకే రెవెన్యూ శాఖ మిన్నకుండి పోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇన్చార్జి తహశీల్దార్ కె.ప్రసన్న కుమార్ను వివరణ కోరగా రెవెన్యూ కొండలు తవ్వేస్తున్న విషయం తమ దృషికి రాలేదన్నారు. జిల్లా అటవీ శాఖాధికారి రామ్మోహనరావును వివరణ కోరగా పీఎల్ పురం బ్లాకులో అటవీ, రెవెన్యూ భూము లున్నాయని, వీటి మధ్య ప్రైవేటు భూములుండే అవకాశంలేదన్నారు. అయినప్పటికీ సర్వే చేయించి వాస్తవాలను తెలుసుకుంటామని చెప్పారు.