నా హత్యకు అఖిలప్రియ దంపతుల కుట్ర: సుబ్బారెడ్డి

TDP Leader AV Subba Reddy Comments On Akhila Priya - Sakshi

సాక్షి, కర్నూలు: తనను హత్య చేసేందుకు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ దంపతులు సుపారీ ఇచ్చారని టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. పోలీసులు చెబితేనే తనకు ఈ విషయం తెలిసిందని చెప్పారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసులు చెప్పిన విషయాలు తెలుసుకుని షాక్‌ తిన్నానని పేర్కొన్నారు. ‘‘నేను అఖిలప్రియపై ఫిర్యాదు చేయలేదు. నా ఆరోపణలకు సమాధానం ఇవ్వకుండా ఆళ్లగడ్డ రమ్మని అఖిలప్రియ అంటోంది. ఆమె నాకు రాజకీయ నేర్పుతుందా. నాపై దాడి జరిగిన తర్వాత రెండున్నర నెలలు మౌనంగా ఉన్నా.. అఖిలప్రియ ముద్దాయి అవునా? కాదా? అన్నదే ప్రశ్న అని’’ ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. (అఖిలప్రియపై సంచలన ఆరోపణలు)

కార్యకర్తలను కాపాడుకున్న చరిత్ర తనదని తెలిపారు. భూమా నాగిరెడ్డి నామినేషన్‌కు వెళ్తుంటే.. దాడులు చేస్తుంటే.. భూజాలపై ఎత్తుకునిపోయి కాపాడానని తెలిపారు. అలాంటి తనను ఎందుకు చంపాలనుకున్నారని ఆయన ప్రశ్నించారు. ఎటువంటి ఆర్థిక లావాదేవీలు భూమా కుటుంబానికి,తమకు లేవని ఆయన స్పష్టం చేశారు. నాగిరెడ్డి కోసం నంద్యాల సీటు వదులుకున్నానని చెప్పారు. ‘‘అఖిలప్రియ ఇంఛార్జ్‌గా ఉంటే.. ఆళ్లగడ్డలో ఎంతమందిని చంపిస్తారో. ఆమెకు తప్పా మరెవ్వరికి అక్కడ అవకాశం ఇచ్చినా మద్దతు ఇస్తా. టీడీపీ అధిష్టానం దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాను. అఖిల ప్రజల్లోకి వెళ్లి గెలవలేదని’’ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

అఖిలప్రియ భర్తకు పోలీసుల నోటీసులు
కడప అర్బన్‌: కర్నూలు జిల్లాకు చెందిన ఏపీ సీడ్స్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ ఏవీ సుబ్బారెడ్డిపై హత్యాయత్నం కేసులో ప్రధాన నిందితుడు, మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌కు విచారణకు హాజరుకావాలని కడప పోలీసులు నోటీసులిచ్చారు. సుబ్బారెడ్డి హత్యకు కడపకు చెందిన వారితో కుట్ర పన్నినట్లుగా భార్గవ్‌పై ఆరోపణలున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top