టీడీపీ నేతపై కత్తితో దాడి | TDP leader | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతపై కత్తితో దాడి

Feb 19 2015 3:49 AM | Updated on Sep 2 2017 9:32 PM

నల్లచెరువు మండల టీడీపీ క న్వీనర్ దాదెం వెంకట శివారెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎనుమలవారిపల్లి ఆదెప్ప కత్తితో దాడి చే యబోగా అడ్డువెళ్లిన ఆయన బావమర్ది విజయ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కదిరి :  నల్లచెరువు మండల టీడీపీ క న్వీనర్ దాదెం వెంకట శివారెడ్డిపై అదే పార్టీకి చెందిన ఎనుమలవారిపల్లి ఆదెప్ప కత్తితో దాడి చే యబోగా అడ్డువెళ్లిన ఆయన బావమర్ది విజయ్‌కుమార్‌రెడ్డి తీవ్రంగా గాయపడి కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. కదిరి నియోజకవర్గంలోని 57 చౌకధాన్యపు డిపో డీలర్ల ఎంపికకు రెండు రోజుల క్రితం కదిరి ఆర్‌డీఓ రాజశేఖర్ ఆధ్వర్యంలో రాత పరీక్ష, ఇంటర్వ్యూలు జరిగాయి. వీటిలో నల్లచెరువు మండలం కమ్మవారిపల్లి చౌక డిపో కూడా ఉంది. దీన్ని తొమ్మిదేళ్లుగా ఆదెప్ప తన  కుమార్తె ప్రమీలమ్మ పేరు మీద నిర్వహించేవారు. కొత్త ఎంపికలో ఆ చౌకడిపోను ఈసారి వినికిడి లోపమున్న వికలాంగులకు రిజర్వ్ చేశారు. ఈ కోటాలో ఆ మండల టీడీపీ కన్వీనర్ వర్గీయుడైన రెడ్డెప్పరెడ్డి ఎంపిక దాదాపుగా ఖరారైందని తెలుసుకున్న ఆదెప్పకు కోపమొచ్చింది. మంగళవారం ఈ విషయమై మండల కన్వీనర్ శివారెడ్డితో గొడవకు దిగారు. బుధవారం మళ్లీ మండల కేంద్రంలోని బస్టాప్ వద్ద అతను ఉన్నాడన్న విషయం తెలుసుకొని ఆదెప్పతో పాటు మరికొందరు కత్తితో అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన శివారెడ్డి బావమర్ది విజయ్ కుమార్ రెడ్డి ఎడమ చేతికి బలమైన గాయం అయింది. గొడవ విషయం తెలుసుకుని కవరేజీ కోసం అక్కడికి వెళ్లిన ‘సాక్షి’ విలేకరి ప్రవీణ్ కుమార్‌రెడ్డిపై జెడ్పీటీసీ సభ్యురాలి భర్త నాగభూషణం నాయుడు రాయితో దాడికి యత్నించాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్‌ఐ మగ్బుల్ బాషా దృష్టికి తీసుకెళ్తే ‘ఏమయ్యా.. నీకు బుద్దుందా? ఎవరైనా దాడి జరిగేటప్పుడు ఫోటోలు తీయడానికి వస్తారా? ఇద్దరూ టీడీపీ వాళ్లే.. నువ్వు ఫోటోలు తీస్తే వారికి మండదా..’ అని తనదైన శైలిలో హితబోద చేశారు. ‘సార్..మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? మీరు ఎలాగైతే విధి నిర్వహణలో ఇక్కడికొచ్చారో.. నేనూ అలాగే న్యూస్ కవరేజ్ కోసం వచ్చాను. నన్ను చంపుతానన్న వ్యక్తిపై చర్య తీసుకోండి.
 
  అతను గతంలో కూడా పలుమార్లు విలేకరులపై ఇలాగే ప్రవర్తిస్తే అప్పట్లో పోలీసులు రౌడీషీట్ కూడా తెరిచారు’ అని చెప్పి ఇదే విషయాన్ని ఫిర్యాదు రూపంలో రాసి అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆ విలేకరి ఆ మండల పోలీస్ స్టేషన్‌లో ఇచ్చారు. కత్తిపోట్లతో గాయపడిన విజయ్‌కుమార్‌రెడ్డి ఆసుపత్రిలో విలేకరులతో మాట్లాడుతూ ‘మా మామ దాదెం వెంకటశివారెడ్డిపై అదెప్పతో పాటు మరో నలుగురు కత్తితో దాడి చేస్తుంటే నేను అడ్డుకున్నాను.
 
  టీడీపీ నాయకులు కొందరు ప్రోత్సహించడంతోనే ఆదెప్ప దాడికి దిగారు’ అని ఆరోపించారు. అయితే ఆదెప్ప కూడా తనపై దాడికి దిగారని కదిరి ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్తే ‘ఎక్కడా ఒక్క గాయం కూడా లేదే’ అని చెప్పి వాపసు పంపారు. తనపై జరిగిన దాడిలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన ‘సాక్షి’ విలేకరి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి కూడా ఉన్నారని ఆయన పోలీసులకిచ్చిన ఫిర్యాదులో కనబరచడం కొసమెరుపు.
 

Advertisement
 
Advertisement
Advertisement