ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం | Take Actions To The Smugglers In The Sand Transport | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

Jun 24 2018 11:56 AM | Updated on Mar 21 2019 8:19 PM

Take Actions To The Smugglers In The Sand Transport - Sakshi

 మాట్లాడుతున్న కలెక్టర్‌ సత్యనారాయణ  

సాక్షి, కర్నూలు(అగ్రికల్చర్‌) : ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ అన్నారు. ఇసుక విధానంపై కలెక్టర్‌ శనివారం తన చాంబర్‌ నుంచి తహసీల్దార్లు, ఈవోఆర్‌డీలు తదితరులతో టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం జిల్లా స్థాయి ఇసుక కమిటీ సభ్యులతో సమీక్షించారు. జిల్లాలోని 16 రీచ్‌ల నుంచి ఇసుక అక్రమంగా తరలించకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.  ఉచిత ఇసుక విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇందులో దళారుల ప్రమేయాన్ని పూర్తిగా అరికట్టాలని సూచించారు.

ఇసుక విధానం అమలుకు జిల్లా స్థాయిలో తాను చైర్మన్‌గా, జాయింట్‌ కలెక్టర్‌ కన్వీనర్‌గా ఉంటారని, డ్వామా పీడీ, పంచాయతీ రాజ్‌ ఎస్‌ఈ, డీపీవో, జెడ్పీ సీఈవోలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. మండల స్థాయిలో తహసీల్దారు ఆధ్వర్యంలో కమిటీ ఉంటుందన్నారు. ప్రతి ఇసుక రీచ్‌కు డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, ఈవోఆర్‌డీలను ఇన్‌చార్జ్‌లుగా నియమించాలన్నారు. ఏ రీచ్‌ నుంచి అక్రమంగా ఇసుక తరలినా ఆ ఇన్‌చార్జ్‌లే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

రీచ్‌లకు ఉపాధి హామీ నిధులతో రోడ్లు వేస్తామన్నారు. ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుక తరలించుకోవాలంటే విధిగా ప్రొసీడింగ్స్‌తో పాటు వాహనాలనంబ ర్లు, ఎన్ని ట్రిప్పుల ఇసుక అవసరం తదితర వివరాలు తెలియజేయాల్సి ఉంటుందన్నారు. ఇళ్ల నిర్మాణాలకు ఇసుక తీసుకోవాలంటే పక్కాగృ హం మంజూరు పత్రం ఉండాలన్నారు. ప్రయివేటు ఇళ్ల నిర్మాణాలకైతే పంచాయతీ సెక్రటరీల ధ్రువీకరణ అవసరమన్నారు. సమావేశంలో జా యింట్‌ కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్, జెడ్పీ సీఈవో విశ్వేశ్వరనాయుడు, డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, డీపీవో ప్రభాకర్‌రావు పాల్గొన్నారు. 


ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించండి 
డయల్‌ యువర్‌ కలెక్టర్, మీ కోసంలో వచ్చిన ప్రజా సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరం నుంచి డయల్‌ యువర్‌ కలెక్టర్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 26 మంది తమ సమస్యలను ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు.  

కమిషనర్‌కు అభినందన 
నగర పాలక సంస్థ కమిషనర్‌ హరినాథరెడ్డిని కలెక్టర్‌ సత్యనారాయణ అభినందించారు. నగరంలో అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించడం, మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టినందుకు జాతీయ స్థాయిలో స్కోచ్‌ అవార్డు లభించడంపై కలెక్టర్‌ హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జేసీ–2 సుబ్బారెడ్డి, డీఆర్‌వో శశీదేవి, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement