చీపుర్లు పట్టారు.. | 'Swachh Bharat' campaign in mandapeta | Sakshi
Sakshi News home page

చీపుర్లు పట్టారు..

Oct 3 2014 12:06 AM | Updated on Sep 2 2017 2:17 PM

చీపుర్లు పట్టారు..

చీపుర్లు పట్టారు..

గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాత్మునికి ఘన నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల్లో

 మండపేట :గాంధీ జయంతిని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమం జిల్లావ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా మహాత్మునికి ఘన నివాళులర్పించారు. వివిధ ప్రాంతాల్లో చీపుర్లు పట్టి రోడ్లను, వీధులను శుభ్రపరిచారు. పరిశుభ్ర భారతావని కోసం పాటుపడతామంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు, నేతలు, విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, ప్రజలు పరిశుభ్రత ప్రతిజ్ఞలు చేసి, ర్యాలీలు నిర్వహించారు. గాంధీజీ కలలుగన్న పరిశుభ్ర భారతావనిని సాకారం చేద్దామని, ‘స్వచ్ఛ భారత్’ను సాధించుకుందామని పిలుపునిచ్చారు. కాకినాడలోని డైరీ ఫారం సెంటర్ నుంచి ఏఎంజీ స్కూల్ వరకూ జరిగిన ర్యాలీలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప,   
 
 చీపుర్లు పట్టారు..
 ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ చైతన్యరాజు, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎమ్మెల్సీ రవికిరణ్‌వర్మ, ఎమ్మెల్యేలు కొండబాబు, దాట్ల సుబ్బరాజు, కలెక్టర్ నీతూ ప్రసాద్, నగరపాలక సంస్థ కమిషనర్ గోవిందస్వామి పాల్గొన్నారు. కాకినాడ టౌన్ రైల్వేస్టేషన్‌లో ఎంపీ తోట నరసింహం ఉద్యోగులతో కలసి పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. కాట్రేనికోన మండలం చెయ్యేరులో చినరాజప్ప, రవికిరణ్‌వర్మ, దాట్ల బుచ్చిరాజు రోడ్డును శుభ్రం చేశారు. ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో చినరాజప్ప, రవికిరణ్‌వర్మ, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు స్వచ్ఛ భారత్‌లో పాల్గొన్నారు. పెద్దాపురం రూరల్ వడ్లమూరులో జరిగిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో చినరాజప్ప పాల్గొన్నారు. సామర్లకోట మండల పరిషత్ కార్యాలయంలో గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
 
  తొండంగి మండలం ఏవీ నగరంలో జరిగిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి యనమల రామకృష్ణుడు, కలెక్టర్ నీతూ ప్రసాద్‌లు.. విద్యార్థులు, ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. తుని రైల్వే స్టేషన్‌లో ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా రైల్వే ఉద్యోగులతో కలిసి రైల్వే స్టేషన్‌ను శుభ్రం చేశారు. జగ్గంపేటలో నిర్వహించిన స్వచ్ఛతా ర్యాలీలో జెడ్పీ ప్రతిపక్ష నేత జ్యోతుల నవీన్ పాల్గొన్నారు. ఎంపీ మురళీమోహన్, ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణలు రైల్వే సిబ్బందితో కలిసి రాజమండ్రిలో రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫాంను శుభ్రం చేశారు. ప్రభుత్వాస్పత్రిలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు వికలాంగులకు వీల్ చైర్స్ పంపిణీ చేశారు. కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి పాల్గొన్నారు. రాజమండ్రి ఓఎన్‌జీసీ బేస్ కాంప్లెక్స్ ఆవరణలోని గోదావరి భవన్ ప్రాంగణాన్ని సిబ్బందితో కలిసి సంస్థ సీఎండీ డీకే షరాఫ్ శుభ్రం చేశారు.
 
  కొత్తపేటలో జరిగిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. రావులపాలెంలో ఎమ్మెల్యే జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు.
  ఏలేశ్వరంలో జరిగిన గాంధీ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు పాల్గొన్నారు. రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకూ జరిగిన స్వచ్ఛ భారత్ ర్యాలీలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఎమ్మెల్సీ పి.రత్నాబాయి పాల్గొన్నారు. మండపేటలో స్వచ్ఛ భారత్ ర్యాలీని ఎంపీ పండుల రవీంద్రబాబు, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గాంధీజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు ద్వారపూడి రైల్వేస్టేషన్‌ను ఉద్యోగులతో కలిసి శుభ్రపరిచారు. రామచంద్రపురంలో నిర్వహించిన స్వచ్ఛభారత్ ర్యాలీలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన కె.గంగవరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి జేసీ ముత్యాలరాజు హాజరయ్యారు. గొల్లప్రోలు నుంచి పిఠాపురం మున్సిపల్ కార్యాలయం వరకూ పిఠాపురం ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement