కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో బీజేపీ నేతలతో చేతులు కలిపిన మండవ జానకిరామయ్య సొంత పార్టీకి ఊహించని రీతిలో జలక్ ఇచ్చారు.
- విజయ డెయిరీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిన దాసరి ప్యానల్
- ఆధిపత్యాన్ని నిలుపుకున్న ‘మండవ’
- సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పోడిచారని దాసరి వర్గం అనుమానం
- పనిచేయని ఎంపీ సుజనా, మంత్రి ఉమాల మంత్రాంగం
విజయవాడ: కృష్ణా జిల్లాలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశంలోని రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరులో బీజేపీ నేతలతో చేతులు కలిపిన మండవ జానకిరామయ్య సొంత పార్టీకి ఊహించని రీతిలో జలక్ ఇచ్చారు. కృష్ణా జిల్లా పాల ఉత్పత్తిదారుల సమాఖ్య(విజయ డెయిరీ) పాలకవర్గ ఎన్నికల్లో టీడీపీకి చెందిన గన్నవరం మాజీ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు ప్యానల్ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీని ఎదిరించి పాలపార్టీ పేరుతో సొంతగా అభ్యర్థులను నిలబెట్టిన విజయ డెయిరీ చైర్మన్ మండవ జానకి రామయ్య ప్యానల్ నుంచి పోటీచేసిన ముగ్గురు అభ్యర్థులూ విజయం సాధించారు. దీంతో టీడీపీ నేతలు ఖంగుతిన్నారు. తెలుగుదేశం పార్టీలో జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
లక్షలు చేతులు మారిన వైనం
విజయ డెయిరీ పాలకవర్గంలో మొత్తం 15 మంది డెరైక్టర్లు ఉంటారు. వారిలో ముగ్గురి పదవీ కాలం పూర్తవడంతో గురువారం ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవులకు టీడీపీకి చెందిన రెండు వర్గాలు పోటీపడ్డాయి. రెండు ప్యానళ్ల అభ్యర్థులు విజయం కోసం సర్వశక్తులూ ఒడ్డారు. డబ్బు, మద్యం వెదజల్లారు. ప్రస్తుతం ఉన్న 12 మంది డెరైక్టర్లలో ఏడుగురు మండవ వర్గం కాగా, ఐదుగురు దాసరి వర్గానికి చెందిన వారు. కాబట్టి ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ముగ్గురు డెరైక్టర్లను గెలిపించుకుని చైర్మన్ పదవి పొందాలని దాసరి వర్గం విశ్వప్రయత్నాలు చేసింది. కానీ, కృష్ణా మిల్క్ యూనియన్లో ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న మండవ జానకిరామయ్య ఈ ఎన్నికల్లో కూడా ముగ్గురు డెరైక్టర్లను గెలిపించుకుని తన పదవికి డోకా లేకుండా చేసుకున్నారు. మండవ తన అనుభవాన్ని ఉపయోగించి చివరి నిమిషంలో బీజేపీకి చెందిన మాజీ మంత్రి యెర్నేని సీతాదేవిని తన ప్యానల్ నుంచి బరిలో నిలిపారు. మండవను చైర్మన్ పదవి నుంచి తప్పించేందుకు దాసరి వర్గం ఏడాది నుంచి ప్రయత్నిస్తోంది.
అర్ధరాత్రి వరకు మంతనాలు...
దాసరి బాలవర్ధనరావు ప్యానల్కు మద్దతుగా తొలి నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంపీ సుజనా చౌదరి, మంత్రి దేవినేని ఉమాలు అర్ధరాత్రి మంతనాలు చేశారు. మండవ జానకిరామయ్యను తప్పించేందుకు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలన్ని విఫలమయ్యాయని సొంత పార్టీ నేతలే చెబుతున్నారు. గన్నవరం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న దాసరి బాలవర్ధనరావుకు విజయ డెయిరీ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చి ఆయన గత ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు డెరైక్టర్లను గెలిపించకుండా ఆయనకు వెన్నుపోటు పోడిచారని దాసరి వర్గం మండిపడుతోంది. ఎన్నికల కౌంటింగ్ అనంతరం దాసరి వర్గీయులు మీడియాతో మాట్లాడుతూ ‘టీడీపీ ప్యానల్ ఓడిందని రాయండి..’ అని మీడియా ఎదుట ప్రకటించారు.
ఎన్టీఆర్ బొమ్మతో గెలిచిన మండవ
పాల పార్టీ పేరుతో డెరైక్టర్లను బరిలో నిలిపిన మండవ జానకిరామయ్య తనకు ఎంతో ఇష్టమైన ఎన్టీఆర్ ఫొటోను మాత్రమే ప్రచారానికి వాడుకున్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు, ఇతర నేతల ఫొటోలు వాడిన దాసరి వర్గం ఓటమి చెందడం ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో చర్చనీయాశంగా మారింది. కొత్త రాష్ట్రానికి రాజధానిగా మారిన జిల్లాలో ఇప్పటికీ గ్రామాల్లో చంద్రబాబు కంటే ఎన్టీఆర్కే అభిమానులు ఎక్కువ ఉన్నారనే విషయం ఈ ఎన్నికల్లో తేటతెల్లమైందని ఆ పార్టీలో సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.