బిల్లు ఆమోదించేవరకూ ఉద్యమం | State bifrucation movement continues until Telangana bill passed in the parliament | Sakshi
Sakshi News home page

బిల్లు ఆమోదించేవరకూ ఉద్యమం

Sep 28 2013 6:40 AM | Updated on Sep 1 2017 11:08 PM

వెయ్యి మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని..

 సత్తుపల్లి, న్యూస్‌లైన్ : వెయ్యి మంది తెలంగాణ అమరవీరుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిందని.. పార్లమెంట్‌లో బిల్లు ఆమో దం పొందేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని టీజేఏసీ చైర్మన్ కూరపాటి రంగరాజు స్పష్టం చేశారు. స్థానిక కళాభారతి ఆడిటోరియంలో శుక్రవారం రాత్రి జరిగిన సకలజనుల భేరి సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీడబ్ల్యూసీ, యూపీఏ ప్రకటన వెలువడి 60 రోజులు కావస్తున్నా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియపై నోట్ పెట్టకపోవడం దారుణమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సారధ్యంలో సీమాంధ్ర ఉద్యమం సాగుతోందని.. ఏపీఎన్‌జీఓలు హైద్రాబాద్‌లో ఉంటూ.. ఈ ప్రాంతానికి వ్యతిరేకంగా కృత్రిమ ఉద్యమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్రలోని అన్ని పార్టీల నాయకులు కలిసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, వారి ఆటలు సాగవని అన్నారు. తెలంగాణ వాదులంతా ఏకమై సకలజనుల భేరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
 
 ఇందుకోసం జిల్లా నుంచి 25 వేల మందిని తరలిస్తున్నామని తెలిపారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు దిండిగల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రక్రియను అడ్డుకుంటే కాంగ్రెస్, సీమాంధ్ర పార్టీలకు పుట్టగతులు ఉండవని హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును ఏ శక్తి ఆపలేదని.. సకల జనులభేరికి స్వచ్ఛందం గా తరలి రావాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ జిల్లా ఇన్‌చార్జ్ నూకల నరేష్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రం, సీమాంధ్రులు కళ్లు తెరిచేలా హైద్రాబాద్‌కు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు. పంచాయతీరాజ్ మినిస్టీరియల్ టీజేఏసీ నాయకులు వెంకటపతిరాజు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను బానిసలుగా ఏపీఎన్‌జీఓల సంఘం అధ్యక్షులు అశోక్‌బాబు మాట్లాడటం గర్హనీయమన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ ప్రజలను బంతిలాగ ఆడుకుంటున్నారని..  ఆరు బాళ్లలో ఆరు సిక్సర్లు కొట్టినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆపలేరని అన్నారు. టీజేఏసీ కన్వీనర్ చిత్తలూరి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సత్తుపల్లి టీజేఏసీ చైర్మన్ కూకలకుంట రవి, టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పాలడుగు శ్రీనివాస్, టీచర్స్ టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, లాయర్స్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు తిరుమలరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, దండు ఆదినారాయణ, వందనపు భాస్కర్‌రావు, ఎస్‌కె అయూబ్‌పాషా, జగదీష్, బి.మధుసూదన్‌రాజు, చెంచురెడ్డి, ముత్యారత్నం, దొడ్డా రమేష్, శ్రీను, రామ్‌నాయక్, ఎ.రాము, వెంకన్న, అద్దంకి వెంకటరత్నం, తడికమళ్ల యోబు, నాగమణి, సంధ్య, షహనాజ్‌బేగం,  సోయం కమల పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement