శ్రీవారి ఆలయంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు.
తిరుమల: శ్రీవారి ఆలయంలో ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. తెలిసీ తెలియక జరిగే దోషాల పరిహరణార్థం పవిత్రోత్సవాలు నిర్వహించటం సంప్రదాయం. క్రీ.శ.1464కు పూర్వం నుంచే పవిత్రోత్సవాలు నిర్వహించేవారు. క్రీ.శ.1562 తర్వాత నిలిచిపోయిన ఈ ఉత్సవాలను తిరిగి 1962 నుంచి టీటీడీ క్రమం తప్పకుండా ప్రతి ఏటా శ్రావణ మాసంలో మూడు రోజులపాటు వైదిక ఆచారాలతో నిర్వహిస్తోంది.
తొలి రోజు శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో మలయప్పస్వామి పవిత్రోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. తులసి పూసలలాగా ఉన్న పట్టు పవిత్రాలను (పట్టుదండలు) యాగశాలలో ప్రతిష్టించి ఏడు గుండాల్లో హోమాలు, ఉత్సవమూర్తులకు అభిషేకం, ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం స్వామివారిని సర్వాభరణాలు, పుష్పమాలలతో విశేషంగా అలంకరించి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. రెండో రోజు పవిత్రాల సమర్పణ, మూడో రోజు పూర్ణాహుతితో కార్యక్రమం ముగింపు పలుకుతారు. ఆ మూడు రోజులు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు.