చిన్నారి అనుమానాస్పద మృతి


నెల్లూరు : నగరంలోని గుర్రాలమడుగు సంఘానికి చెందిన మహమ్మద్ అన్సారి, ప్రత్యూష కుమార్తె అర్షియా (6) మంగళవారం అనుమానాస్పదస్థితిలో మృతిచెందింది. అయితే తండ్రే ఆ చిన్నారిని హత్య చేశాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘటన అనంతరం తండ్రి అన్సారి పరారీ కావడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది. మహమ్మద్ అన్సారి, ప్రత్యూష ప్రేమించుకుని గతేడాది పెళ్లి చేసుకున్నారు. ప్రత్యూష ఆడపిల్లకు జన్మనివ్వడంతో భార్యాభర్తల మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అయితే ఆ చిన్నారి పుట్టినప్పటి నుంచి అనారోగ్యంతో ఉండటంతో చికిత్స చేయిస్తున్నారు.


 


ఈక్రమంలో మంగళవారం ఇంట్లో భార్యాభర్తలు మాత్రమే ఉన్నారు. ఉదయం చిన్నారికి తల్లి స్నానం చేయించి నిద్రపుచ్చింది. కొద్దిసేపటికే ఆ చిన్నారి చలనం లేకుండా ఉండటంతో అనుమానం వచ్చిన ప్రత్యూష చూసేసరికి విగతజీవిగా పడి ఉంది. ఈ సంఘటన అనంతరం అన్సారి ఇంట్లో నుంచి పరారయ్యాడు. దీన్ని బట్టి ఆ చిన్నారిని తండ్రే హతమార్చి పరారయ్యాడని ప్రత్యూషాతో పాటు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top