విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్ | Siren current employees strike | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల సమ్మె సైరన్

Sep 12 2013 3:01 AM | Updated on Sep 1 2017 10:37 PM

విద్యుత్ ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృత చేస్తున్నారు. గురువారం నుంచి సమ్మెలోకి వెళ్తుండడంతో బుధవారం త మ సిమ్‌కార్డులను ఎస్పీడీసీఎల్ కంపెనీకి వెనక్కి పంపారు.

సాక్షి, తిరుపతి: విద్యుత్ ఉద్యోగులు సమైక్య ఉద్యమాన్ని ఉద్ధృత చేస్తున్నారు. గురువారం నుంచి సమ్మెలోకి వెళ్తుండడంతో బుధవారం త మ సిమ్‌కార్డులను ఎస్పీడీసీఎల్ కంపెనీకి వెనక్కి పంపారు. డిస్కం పరిధిలోని నెల్లూరు, చిత్తూరు, కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో  ఉద్యోగులు సిమ్‌కార్డులను ఎస్‌ఈలకు అందజేశారు. జిల్లాలో 500కు పైగా సిమ్‌కార్డులను  ఉద్యోగులు వెనక్కి ఇచ్చారు. తిరుపతిలోని డిస్కం కార్పొరేట్ కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు కూడా 150 మందికి పైగా సిమ్‌కార్డులు వెనక్కి ఇచ్చారు. నెల్లూరు జిల్లాలోనూ 250 మంది విద్యుత్ అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది సిమ్‌కార్డులను వెనక్కి ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో 300కు పైగా సిమ్‌కార్డులు ఎస్‌ఈకి అందజేశారు.
 
 నేటి నుంచి సమ్మె: డిస్కం పరిధిలోని ఆరు జిల్లాల్లో విద్యుత్ ఉద్యోగులు గురువారం నుంచి సమ్మె సైరన్ మోగించనున్నారు. ప్రధానంగా తిరుపతి, విజయవాడ, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు నగరాల్లో సమ్మె ప్రభావం కనపడనుంది. ఎల్‌టీ సర్వీసులతో పాటు పారిశ్రామికంగా ఎక్కువ హెచ్‌టీ సర్వీసులు ఉన్న కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో విద్యుత్ సమ్మెతో పరిశ్రమలకు పెద్ద దెబ్బ తగలనుంది. సమ్మెలో భాగంగా మొదట సర్వీసు మెయింటెన్స్ వంటి   పనులకు సంబంధించి విధులకు గైర్హాజరు కానున్నారు.

ఆ తర్వాత విడతల వారీగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేసేందుకు సిద్ధమవుతున్నారు. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వాణిజ్య సర్వీసులు ఎక్కువగా ఉన్నాయి. వీటికి కూడా విద్యుత్ సరఫరా నిలి పేసే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో డిస్కం సీఎండీ హెచ్‌వై దొర అత్యవసర సర్వీసులైన ఆస్పత్రులు, హోటళ్లు, తిరుమల టీటీడీ అవసరాలకు విద్యుత్ సరఫరాకు ఇబ్బంది లేకుండా చూడాలని ఇప్పటికే విద్యు త్ ఉద్యోగుల జేఏసీ నాయకులకు విజ్ఞప్తి చేసి ఉన్నారు.
 
 నేడు సీఎంతో చర్చలు:  ట్రాన్స్‌కో, డిస్కం విద్యుత్ ఉద్యోగ సంఘాలతో సీఎం బుధవారం సాయంత్రం 4 గంటలకు జరపాల్సిన చర్చలు వాయిదాపడ్డాయి. గురువారం ఉదయం 10 గంటలకు జరగనున్నాయి. సీఎంతో చర్చల్లో పాల్గొనేందుకు తిరుపతి నుంచి జేఏసీ కన్వీనర్ మునిశంకరయ్య, ఇతర నాయకులు హైదరాబాద్ వెళ్లారు.
 

Advertisement
 
Advertisement
Advertisement