
గుండె గు‘బిల్లు’
ఇంధన సర్దుబాటు చార్జీల భారం నుంచి జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విముక్తి లభించడం లేదు. ఎప్పుడో వాడిన విద్యుత్కు సర్చార్జీ పేరుతో ఇప్పుడు బిల్లులు విధిస్తూ విద్యుత్
సాక్షి, ఏలూరు: ఇంధన సర్దుబాటు చార్జీల భారం నుంచి జిల్లాలోని విద్యుత్ వినియోగదారులకు విముక్తి లభించడం లేదు. ఎప్పుడో వాడిన విద్యుత్కు సర్చార్జీ పేరుతో ఇప్పుడు బిల్లులు విధిస్తూ విద్యుత్ శాఖ ఇప్పటికే కోట్లాది రూపాయలు వసూలు చేసింది. తాజాగా 2011-12 త్రైమాసికానికి సంబంధించి దాదాపు రూ.43.86 కోట్లను వసూలు చేసేందుకు సిద్ధమైన విద్యుత్ శాఖ ఈ నెల బిల్లు నుంచే అదనపు చార్జీలు జోడిస్తోంది. వచ్చే సెప్టెంబర్ వరకు ఐదు నెలల పాటు ప్రతినెలా బిల్లులో ఇంధన చార్జీల వడ్డన తప్పదని అధికారులు చెబుతున్నారు.
ఎన్నికల కోసం కొన్నాళ్లు బ్రేక్
ఇవ్వాల్సిన సబ్సిడీలను ఎగ్గొట్టి జనం నుంచే సొమ్ములు వసూలు చేసుకోమని విద్యుత్ శాఖకు గత ప్రభుత్వం స్పష్టం చేయడంతో ఎన్నికల ముందు వరకూ సర్చార్జీలను వసూలు చేశారు. దీనివల్ల విద్యుత్ శాఖ పరవు పోవడంతోపాటు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ఇలా అయితే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని భావించిన ప్రభుత్వం సర్చార్జీలను తాత్కాలికంగా ఎత్తివేసేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల్లో లబ్ధికోసం ఈ నిర్ణయం తీసుకున్న అప్పటి అధికార పార్టీ ప్రజాగ్రహంలో కొట్టుకుపోయింది. ఎన్నికలు ము గియడంతో మళ్లీ సర్చార్జీల వసూలుకు విద్యుత్శాఖ సిద్ధమైంది.
వాడిందొకరు.. కట్టేది మరొకరు
విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే బొగ్గు, నాఫ్తా ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నందున పెరుగుదలలో వ్యత్యాసం మొత్తాన్ని వినియోగదారుల నుంచే వసూలు చేయాలని డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ చార్జీలనే సర్చార్జీలుగా పిలుస్తున్నారు. ఎప్పుడో వాడిన విద్యుత్ను అప్పట్లో ఉత్ప త్తి చేయడానికి అయిన ఖర్చును ఇప్పుడు వినియోగదారుడిపై వేయడమే ఈ చార్జీల్లోని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల అద్దె ఇళ్లల్లో ఉండే వారిపై ఆర్థిక భారం పడుతోంది. ఎవరో వినియోగించుకున్న విద్యుత్కు బిల్లు వచ్చే నాటికి ఎవరు అద్దెకు ఉంటే వాళ్లే చెల్లించాల్సి వస్తోంది. అసలు వినియోగంపై పడే చార్జీల కంటే ఈ కొసరు చార్జీలు పెరిగి బిల్లు వందల రూపాయల స్థాయి దాటి వేల రూపాయల్లోకి చేరిపోయింది.
రూ.195.96 కోట్లు సమర్పణ
సర్చార్జీల పేరుతో జిల్లా ప్రజల నుంచి కోట్లాది రూపాయలు వసూలు చేస్తున్నారు. 2009-10 సంవత్సరానికి దాదాపు రూ.3 కోట్లను సర్చార్జీగా వసూలు చేయడాన్ని హైకోర్టు నిలిపివేసింది. ఈ కేసు ఇప్పటికీ తేలలేదు. 2010-11 సంవత్సర సర్చార్జీ రూ.4.22 కోట్లు, 2011-12 ఆర్థిక సంవత్సర త్రైమాసిక సర్చార్జీ రూ.44 కోట్లు వసూలు చేసేశారు. తాజాగా రెండో త్రైమాసిక చార్జీలు రూ.43.86 కోట్లు వసూలు చేస్తున్నారు. 2012-13 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.103.88 కోట్లు ఇప్పటికే విద్యుత్ బిల్లుతోపాటు వడ్డిస్తున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 11,81,672 మంది విద్యుత్ వినియోగదారుల నుంచి కేవలం ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రూ.195.96 కోట్లను విద్యుత్ శాఖ వసూలు చేస్తోంది.
అసలును మించిపోతున్న కొసరు
వినియోగించిన విద్యుత్కు సంబంధించి వచ్చే బిల్లుకంటే కొసరు చార్జీలు ఎక్కువగా ఉంటున్నాయి. 140 యూనిట్లు విద్యుత్ వాడిన విని యోగదారుడు చెల్లించాల్సిన బిల్లు రూ.404 మాత్రమే. కానీ ఆ బిల్లులో కష్టమర్ చార్జీ రూ.35, విద్యుత్ సుంకం రూ.8.40పైసలు, 2012-13 సర్చార్జీ రూ.454.89 పైసలు, 2011-12 సర్చార్జీ రూ.21.80 పైసలు చొప్పున మొత్తం రూ.924.09 వస్తోంది. అంటే అసలు కంటే కొసరు బిల్లు రూ.520.09 అధికం. ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ బిల్లులు వస్తుండటంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.