వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపడుతున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పిలుపునిచ్చారు.
ఆళ్లగడ్డ, న్యూస్లైన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల చేపడుతున్న సమైక్య శంఖారావం బస్సు యాత్రను విజయవంతం చేయాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని తన నివాస గృహంలో రుద్రవరం, చాగలమర్రి మండలాల కార్యకర్తలతో మంగళవారం ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగితే సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సీమాంధ్ర ప్రజల్లో ఉద్యమ చైతన్యం నింపడానికి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించారన్నారు.
ఆళ్లగడ్డ ప్రాంతానికి యాత్ర వచ్చినపుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సమైక్యాంధ్ర ఉద్యమకారులు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే చిత్తశుద్ధితో సమైక్యాంధ్రను కోరుకుంటోందన్నారు. టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రాంతానికో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు. రెండు నాల్కల బాబును ప్రజలు నమ్మబోరన్నారు. రాష్ట్ర విభజన ప్రకటనకు కారణమైన కాంగ్రెస్, టీడీపీ నాయకులను నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బీవీ రామిరెడ్డి, నిజాముద్దిన్, రంగనాయకులు, యర్రం ప్రతాపరెడ్డి, సత్యనారయణ, రాంగుర్విరెడ్డి, లక్ష్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
6న ఆళ్లగడ్డలో బస్సు యాత్ర
షర్మిల బస్సు యాత్ర ఈనెల 6వతేదీ శుక్రవారం మధ్యాహ్నం 3గంటలకు ఆళ్లగడ్డకు చేరుకుంటుందని ఎమ్మెల్యే శోభానాగిరెడ్డ తెలిపారు. ఆళ్లగడ్డ పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పిస్తారన్నారు. ఆళ్లగడ్డలో బహిరంగ సభ ఉండబోదని స్పష్టం చేశారు. రోడ్దు వెంట ప్రజలకు అభివాదం చేస్తూ షర్మిల ముందుకు సాగుతారన్నారు.