కేంద్రానికి నివేదిక పంపేందుకు వీలుగా వారం రోజుల్లో కరువు మండలాలకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు.
సాక్షి, హైదరాబాద్: కేంద్రానికి నివేదిక పంపేందుకు వీలుగా వారం రోజుల్లో కరువు మండలాలకు సంబంధించిన పూర్తి వివరాలను పంపించాలని జిల్లా కలెక్టర్లను రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి ఆదేశించారు. ఖరీఫ్లో నెలకొన్న కరువు పరిస్థితులు, కరువు మండలాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలపై జిల్లా కలెక్టర్లతో మంగళవారం రఘువీరా వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ‘సీమాంధ్ర ఉద్యోగుల సమ్మెతో కరువు మండలాల నివేదిక రూపొందించడం నెల ఆలస్యమైం ది. ఇంకా ఆలస్యమైతే రైతులకు నష్టం జరుగుతుంది.
అందువల్ల యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని వారంలో నివేదిక పంపండి. దానిని క్రోడీకరించి రాష్ట్రప్రభుత్వం నెలాఖరులోగా కేంద్రానికి పంపుతుంది. నివేదికలు అందించడంలో ఆలస్యం వల్ల ఏ ప్రాంతానికైనా అన్యాయం జరిగితే అందుకు కలెక్టర్లనే బాధ్యుల్ని చేస్తాం’ అని తెలిపారు. ‘మనం నివేదిక ఎంత త్వరగా పంపిస్తే కేంద్రం నుంచి కరువు బృందం అంత త్వరగా వస్తుంది. వారు త్వరగా వస్తే ఇక్కడి నష్టాన్ని చూసి ఎక్కువ సాయానికి సిఫార్సు చేయడానికి వీలవుతుంది’ అని అన్నారు. పై-లీన్ తుపాను నష్టానికి సంబంధించిన నివేదికను బుధవారం కేంద్రానికి పంపిస్తామని చెప్పారు.