నిరసన జ్వాల | seemandhra bandh successes | Sakshi
Sakshi News home page

నిరసన జ్వాల

Dec 8 2013 4:07 AM | Updated on Jul 25 2018 4:09 PM

రాష్ట్ర విభజనపై ‘అనంత’లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకుంది.

సాక్షి, అనంతపురం :  రాష్ట్ర విభజనపై ‘అనంత’లో ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. జిల్లా వ్యాప్తంగా సమైక్యాంద్ర ఉద్యమం ఊపందుకుంది. విభజనకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్ విజయవంతమైంది. శనివారం విద్యా సంస్థలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా 970 ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అనంతపురంలో వైఎస్‌ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఇంటిని ముట్టడించే యత్నం చేయగా.. పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ నేత ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో కార్యకర్తలు బంద్ పర్యవేక్షించారు.

సప్తగిరి సర్కిల్‌లో టైర్లకు నిప్పు పెట్టి సమైక్య  నినాదాలు చేశారు. ఎస్కేయూ నుంచి భారీగా నగరంలోకి వచ్చిన విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం విద్యార్థులను అదుపులోకి తీసుకుని త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కళ్యాణదుర్గం రోడ్డులో టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీత, ఇతర నేతలు రాస్తారోకో నిర్వహించారు. సమాజ్‌వాదీ పార్టీ, ఉపాధ్యాయ జాక్టో నాయకులు ర్యాలీ నిర్వహించారు. డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయంలో మాతృ మరణాలపై సమీక్షను వైఎస్‌ఆర్‌సీపీ లీగల్ సెల్ కన్వీనర్ రమణారెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు అడ్డుకున్నారు. సమైక్య నినాదాలతో హోరెత్తించారు. ఆర్ట్స్ కళాశాల విద్యార్థులను కట్టడి చేసేందుకు హాస్టల్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ధర్మవరంలో వైఎస్‌ఆర్‌సీపీ నేతలు.. సోనియా గాంధీ, చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మలను దహనం చేశారు. హిందూపురంలో విశాలాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి కాంగ్రెస్ పార్టీ జెండాలు, కండువాలను దహనం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇనాయతుల్లా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేశారు.

లేపాక్షి, చిలమత్తూరు, బత్తలపల్లి, ముదిగుబ్బలో ర్యాలీ లు, మానవహారాలు చేపట్టారు. కదిరిలో వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త ఇస్మాయిల్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేసి జీవోఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. టీడీపీ నేత అత్తార్ చాంద్‌బాషా, దేవానంద్ ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలిలో వంటావార్పు చేపట్టారు. కళ్యాణదుర్గంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త బోయ తిప్పేస్వామి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. టీడీపీ నేత హనుమంతరాయ చౌదరి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కుందుర్పి, గాండ్లపెంట, విడపనకల్లు, అమరాపురం, కూడేరు, గార్లదిన్నె, కణేకల్లు, బుక్కపట్నం, గుడిబండ, కంబదూరు, బుక్కరాయసముద్రం, పుట్టపర్తి, ఓడీసీ, అమడగూరు మండలాల్లో వైఎస్‌ఆర్‌సీపీ  శ్రేణులు, విద్యార్థులు  బైక్‌ర్యాలీలు, ర్యాలీలు నిర్వహించారు. మడకశిరలో వైఎస్సార్‌సీపీ నాయకులు వైసీ గోవర్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ చేపట్టారు. సోనియాగాంధీ దిష్టి బొమ్మను దహనం చేశారు.

 టీడీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. నల్లమాడలో వైఎస్‌ఆర్‌సీపీ నేత సోమశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. పరిగిలో టీడీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపురామ చంద్రారెడ్డి సతీమణి కాపు భారతి ఆధ్వర్యంలో బంద్ పాటించారు. బైక్ ర్యాలీ నిర్వహించారు. టీడీపీ నేత దీపక్‌రెడ్డి ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీ నిర్వహించారు. తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నాయకులు, టీడీపీ నేతలు.. ఉరవకొండలో జాక్టో ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement