లక్షలు ఖర్చుచేసినా... | Seed shortage Prevention | Sakshi
Sakshi News home page

లక్షలు ఖర్చుచేసినా...

Sep 26 2015 12:37 AM | Updated on Sep 3 2017 9:58 AM

ఆశయం మంచిదే... అమలులోనే విఫలమయ్యారు. లక్షలు ఖర్చుచేశారు... లక్ష్యాన్ని మరిచారు. విత్తనాలు స్థానికంగా తయారు చేసుకోవాలని భావించారు...

ఆశయం మంచిదే... అమలులోనే విఫలమయ్యారు. లక్షలు ఖర్చుచేశారు... లక్ష్యాన్ని మరిచారు.  విత్తనాలు స్థానికంగా తయారు చేసుకోవాలని భావించారు... పరికరాలు కొనుగోలు చేశారు... టార్పాలిన్లతో మూతపెట్టేశారు. కనీసం వచ్చే ఖరీఫ్‌కైనా వాటిని వినియోగంలోకి తెస్తే విత్తన కొరతను నివారించడం కష్టం కాదేమో.
 
 సారవకోట:  జిల్లాలో రైతాంగం స్థానికంగానే విత్తనాలను ఉత్పత్తి చేసుకునేందుకు జిల్లా అధికారులు యోచించారు. ఇందుకోసం పీఏసీఎస్‌ల ద్వారా నాబార్డు సాయంతో యంత్రాలను కూడా సమకూర్చారు. కానీ వాటిని వినియోగించకపోవడంతో అవికాస్తా మూలకు చేరాయి. జిల్లాలోని పాలకొండ, వజ్రపుకొత్తూరు, పాతపట్నం, తెంబూరు, బుడితి, తూలుగు, అరసవల్లి, కోటబొమ్మాళి పీఏసీఎస్‌లకు ఈ యంత్రాలు గత ఏడాది మంజూరు చేశారు. ఒక్కో యంత్రాన్ని రూ. ఐదులక్షలు వెచ్చించి పంజాబ్ నుంచి కొనుగోలు చేసిన వ్యవసాయ శాఖ పీఏసీఎస్‌లకు అందించింది. కానీ వాటిని భద్రంగా టార్పాలిన్‌లో కప్పి ఉంచాల్సి వచ్చింది.
 
 విత్తన కొరత నివారణకే...
 జిల్లాలో 98 శాతం వ్యవసాయ భూమి వరి సాగులో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని 1.60 లక్షల క్వింటాళ్ళ విత్తనాలు అవసరం అవుతుందని భావించిన అధికారులు స్థానికంగా తయారు చేసుకునేందుకు వీలుగా ఈ యంత్రాలను అందించారు. రైతుల నుంచి ధాన్యం సేకరించి వాటిని ఈ యంత్రాలలో వేసి విత్తనాలుగా మార్చాల్సి ఉంటుంది. అవసరమైతే పొలాల దగ్గరకు కూడా వీటిని తీసుకెళ్లి ధాన్యాన్ని విత్తనాలుగా మార్చే వెసులుబాటు ఉంది. వీటి వినియోగంపై కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు కొంతమంది రైతులకు శిక్షణనివ్వాలి. కానీ వ్యవసాయ సిబ్బందిగానీ, కేంద్ర సహకార బ్యాంకు అధికారులుగానీ ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో యంత్రాలు మూలకు చేరిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement