రాలిన పసి మొగ్గ | School bus beet the children | Sakshi
Sakshi News home page

రాలిన పసి మొగ్గ

Sep 10 2015 11:52 PM | Updated on Sep 3 2017 9:08 AM

రాలిన పసి మొగ్గ

రాలిన పసి మొగ్గ

స్కూలు బస్సు దిగి మరికాసేపట్లో ఇంటికి చేరాల్సిన చిన్నారి ‘చితి’కిపోయింది..

చిన్నారిని చిదిమేసిన స్కూలు బస్సు
 
పద్మనాభం: స్కూలు బస్సు దిగి మరికాసేపట్లో ఇంటికి చేరాల్సిన చిన్నారి ‘చితి’కిపోయింది.. అమ్మ ఒడి చేరాలని, ఆడి పాడాలని హుషారుగా అడుగేసిన పసి మొగ్గ అంతలోనే రాలిపోయింది.. బస్సు దిగిందో లేదో గమనించకుండా డ్రైవర్ బస్సు కదిలించడంతో ఒక్కసారిగా తూలిపడిన పాపాయి చక్రాల కింద నలిగిపోయింది.. పోలీసులు అందించిన వివరాలు.. సామయ్యవలస గ్రామానికి చెందిన రొంగలి లిఖిత (5) కృష్ణాపురం స్ప్రింగ్ ఫీల్డ్ పబ్లిక్ స్కూల్లో ఎల్‌కేజీ చదువుతోంది. రోజూ స్కూల్ బస్సులోనే పాఠశాలకు వచ్చి వెళుతుంటుంది. బుధవారం సాయంత్రం బడి ముగిశాక స్కూల్ బస్సులో సామయ్యవలస వెళ్లింది. బస్సు దిగుతుండగానే డ్రైవర్ బస్సును లాగించడంతో టైర్ల కింద పడి కడుపు భాగంలో బలమైన గాయాలయ్యాయి.

దీంతో ఆమెను తగరపువలసలోని ఓ నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక్కడ నుంచి విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ చిన్నారి అర్ధరాత్రి సమయంలో మృతి చెందింది. మృతురాలి తండ్రి అప్పన్న ఇచ్చిన ఫిర్యాదు మేరుకు బస్సు డ్రైవర్ కనకల శ్రీనుపై కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డ్రైవర్ పరారీలో ఉన్నాడు. రొంగలి అప్పన్న, సీత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె లిఖిత మరణంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరిని ఓదార్చడం ఎవరి తరం కావడంలేదు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement