ఇద్దరు మృతి.. 8 మందికి తీవ్ర గాయాలు
మృతుల్లో రెండేళ్ల చిన్నారి
పర్వతగిరి: వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని శ్రీనగర్–కొంకపాక క్రాస్ రోడ్డు వద్ద సోమవారం సాయంత్రం స్కూల్ బస్సు.. ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా 8 మందికి గాయాలయ్యాయి. వరంగల్ నగరంలోని రంగశాయిపేట నిజాంపుర, చార్బౌలికి చెందిన మూడు కుటుంబాల వారంతా కలిసి ట్రాక్టర్లో ఆదివారం పర్వతగిరి మండలంలోని అన్నారం దర్గా షరీఫ్కు వెళ్లారు. సోమవారం సాయంత్రం తిరిగి వరంగల్కు బయలుదేరారు. సంగెం మండలం తీగరాజుపల్లిలో ఓ ప్రైవేటు స్కూల్ బస్సు పిల్లలను ఇంటి వద్ద దిగబెట్టేందుకు వస్తోంది.
ఈ క్రమంలో మార్గమధ్యలోని శ్రీనగర్–కొంకపాక క్రాస్ రోడ్డు వద్ద స్కూల్ బస్సు ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న రెహన్(2), ఇస్మాయిల్(50) అక్కడికక్కడే చనిపోయారు. నాజియా సుల్తానా, ఫయాజ్, వజేద, ఖాదర్బీ, వహీద, అమీన, సర్వర్, హర్షిత్లకు గాయా లయ్యాయి. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించారు. కాగా, ప్రమాద సమయంలో స్కూల్ బస్సులో 30 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.


