కల్యాణ వైభోగమే.. | sankranthi grand celebrations in srisailam | Sakshi
Sakshi News home page

కల్యాణ వైభోగమే..

Jan 16 2014 4:50 AM | Updated on Sep 27 2018 5:46 PM

శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి రోజున చెంచుల సంప్రదాయంతో మల్లన్న కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్‌తెలిపారు.

శ్రీశైలం, న్యూస్‌లైన్: శ్రీశైల మహాక్షేత్రంలో సంక్రాంతి రోజున చెంచుల సంప్రదాయంతో మల్లన్న కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఈఓ చంద్రశేఖర ఆజాద్‌తెలిపారు.  చెంచుల సంస్కృతి సంప్రదాయాలకు శ్రీశైలక్షేత్రానికి,  సంకాత్రి కల్యాణోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ప్రచారంలో ఉన్న స్థానిక జానపద కథలలో భాగంగా  ఒకప్పుడు శ్రీ మల్లికార్జునస్వామి శ్రీశైలం అడవుల్లో చెంచు వేషంలో సంచరిస్తూ ఒక చెంచు కన్యను మకర సంక్రాంతి రోజునే వివాహం చేసుకున్నారని చెబుతారన్నారు. అందుకే ఇప్పటికీ చెంచులు శ్రీ భ్రమరాంబాదేవిని తమ కూతురిగా మల్లికార్జునుడిని  తమ అల్లుడిగా భావిస్తారని వివరించారు. అలాగే చెంచులు స్వామివార్లను చెంచుమల్లన్న, చెంచు మల్లయ్య అని అప్యాయంగా పిలుచుకుంటారన్నారు.  
 
 ఆలయ ప్రాకార కుడ్యంపై ఒక అటవిక యువతికాలిలో గ్రుచ్చుకున్న ముల్లును ఒక అటవిక యువకుడు తీస్తున్నట్లుగా మలచబడిన శిల్పం ఈ జానపత కథకు బలాన్ని చేకూరుస్తుందన్నారు. ఈశిల్పంలోని అటవిక యువకుడే చెంచుల వేషంలో ఉండే మల్లికార్జునుడు అని చెంచు భక్తులు భావిస్తారన్నారు. అంతేకాకుండా మల్లికార్జునుడు చెంచు యువతిని ఎవరికీ తెలియకుండా సంక్రాంతి రోజున రహస్యంగా వివాహం చేసుకున్నాడని,  అందుకే  ఈ సంక్రాంతి కల్యాణోత్సవాన్ని తమ సంప్రదాయంలో శ్రీ స్వామివారి దొంగపెళ్లిగా భావిస్తారని స్థానిక చెంచులు పేర్కొన్నట్లు చెప్పారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement