ఆ ఊళ్లకు ఊరట

A Sakshi representative visits to Visakha Gas Leakage effected villages

విశాఖలో కోలుకుంటున్న ఐదు గ్రామాలు 

ఇళ్లను చూసుకుని తిరిగి వెళుతున్న ప్రజలు 

గాలి, నీరు, నేల సురక్షితమని నిపుణులు తేల్చాకే రావాలని అధికార యంత్రాంగం విజ్ఞప్తి 

గ్రామాల్లో నిరంతరం పోలీసుల గస్తీ 

పూర్తిస్థాయిలో  పారిశుద్ధ్య పనులు 

విషవాయువు ప్రభావిత గ్రామాల్లో ‘సాక్షి’ ప్రతినిధి సందర్శన 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విషవాయువు మిగిల్చిన భయానక జ్ఞాపకాల నుంచి విశాఖలోని ఐదు గ్రామాలు క్రమంగా తేరుకుంటున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు శ్రమించడంతో మూడు రోజుల్లోనే కాలుష్య మేఘాలు తొలగిపోయాయి. రసాయనాలతో కూడిన వాయువులు ఆవిరవుతున్నాయి. గ్రామస్తుల్లో భయాలను తొలగించేందుకు జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థ (నీరి) నుంచి ఐదుగురితో కూడిన  నిపుణుల బృందాన్ని ప్రభుత్వం రంగంలోకి దించింది. గ్రామాల్లో గాలి, నీరు, నేలపై స్టైరీన్‌ అవశేషాల కోసం పరీక్షలు నిర్వహిస్తోంది. విషపూరిత వాయువులు లేవని నిపుణులు నిర్ధారించిన తరువాతే గ్రామస్తులను సురక్షితంగా ఇళ్లకు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

నిపుణుల బృందం మరో 24 గంటల్లో నివేదిక ఇవ్వనుంది. ప్రాథమిక అంచనా ప్రకారం అక్కడ వాతావరణం దాదాపుగా సాధారణ పరిస్థితికి వచ్చినట్లు తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఎల్‌జీ పాలిమర్స్‌కు సమీపంలోని ఐదు గ్రామాలైన వెంకటాపురం, నందమూరి నగర్, పద్మనాభనగర్, ఎస్సీబీసీ కాలనీ, కంపరపాలెంలలో తాజా పరిస్థితిని తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రతినిధి ఆదివారం అక్కడ పర్యటించారు. గురు, శుక్రవారాల్లో బాధిత గ్రామాల్లో కనిపించిన మూగజీవాల కళేబరాలను తొలగించడంతో పాటు పారిశుద్ధ్య పనులు పూర్తి స్థాయిలో చేపట్టారు. ప్రతి గ్రామంలో గాలి కాలుష్యాన్ని సైతం పరిశీలిస్తున్నారు. గాలిలో స్టైరీన్‌ గ్యాస్‌ దాదాపుగా తొలగిపోయినట్లు అధికారులు గుర్తించారు. 

నిరంతరం పోలీస్‌ నిఘా
దుర్ఘటన అనంతరం గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. పలు ఇళ్లకు తాళాలు వేయలేదు. దీంతో పోలీసులు నిరంతరం నిఘా పెట్టారు. కొన్ని ఇళ్లకు పోలీసులే తాళాలు కొనుగోలు చేసి వేశారు. డీసీపీ–2 ఉదయ్‌ భాస్కర్‌ బిల్లా ఆధ్వర్యంలో సిబ్బంది ప్రతి గ్రామంలోనూ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నారు. డీసీపీ నిరంతరం ఈ గ్రామాల్లోనే మకాం వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. జీవీఎంసీ కమిషనర్‌ సృజన కూడా స్థానికంగా పర్యటించారు. 

మూగ జీవాలకు సపర్యలు.. 
ఎల్జీ పాలిమర్స్‌కు అతి సమీపంలోని వెంకటాపురానికి చెందిన ఇల్లపు తాతారావు పాడిరైతు. కొద్దిపాటి పొలం మీద వచ్చే ఆదాయంతో  జీవిస్తున్నాడు. గ్యాస్‌ లీకేజీ ప్రమాదంలో తాతారావుకు చెందిన ఒక గేదె, మూడు పెయ్యలు, ఒక ఆవు, లేగదూడ అక్కడిక్కకడే మృత్యువాత పడ్డాయి. ఒక గేదె చూపు కోల్పోయింది. మూడు రోజులు వేరే చోట తలదాచుకున్న ఆయన ఆదివారం సాయంత్రం పశువులశాలకు చేరుకుని గేదెకు  సపర్యలు చేస్తూ కనిపించారు. అంతా సర్దుకున్నాక ఇంటికి వస్తానని తాతారావు చెప్పారు. 
చూపు కోల్పోయిన గేదెకు సపర్యలు చేస్తున్న తాతారావు 

తొలగిన భయం.. 
కంపరపాలెనికి చెందిన కంచిపాటి శంకర్రావు కుటుంబం ఎల్జీ పాలిమర్స్‌లో ప్రమాదం జరిగిన రోజు సబ్బవరంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఆదివారం సాయంత్రం కుటుంబం అంతా తిరిగి వచ్చేసింది. ఇళ్లంతా శుభ్రం చేసుకుని వంట చేసుకుని భోజనం చేశారు. కుటుంబ సమేతంగా ఇంట్లో కూర్చోని టీవీ చూశారు.      

వెంకటాపురంలో.. 
ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీకి ఆనుకుని సుమారుగా 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి చెందిన వారే ఎక్కువగా విష వాయువుతో ప్రభావితమయ్యారు. గ్రామంలో సుమారు 1,250 ఇళ్లు, 5 వేల జనాభా ఉంది. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా గ్రామానికి చేరుకుని ఇళ్లను చూసి శుభ్రం చేసుకుని తిరిగి వెళుతున్నారు. జీవీఎంసీ సిబ్బంది ప్రతి అరగంటకు ఒకసారి ఇక్కడ సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని చల్లుతున్నారు. 

నందమూరినగర్‌లో..
కంపెనీకి  కిలోమీటర్‌ దూరంలో ఉన్న ఈ గ్రామంలో 600 పైచిలుకు ఇళ్లు, 2,250 మంది జనాభా ఉన్నారు. నీరి (నేషనల్‌ ఎన్విరాన్మెంటల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) నిపుణుల బృందం ఇక్కడ నీరు, మట్టి పరీక్షలు నిర్వహిస్తోంది. గ్రామం నుంచి కొన్ని నమూనాలను సేకరించారు. గాలి కాలుష్యాన్ని పరిశీలించగా  0.1గా నమోదైనట్లు చూపించింది. 

పద్మనాభనగర్‌లో.. 
కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సుమారుగా 500 ఇళ్లు ఉండగా 2,200 మంది వరకు ఉంటున్నారు. తిరిగి వస్తున్న వారికి పోలీసులు నచ్చజెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జీవీఎంసీ సిబ్బంది పారిశుద్ధ్య పనులతో పాటు ఎప్పటికప్పుడు బ్లీచింగ్, స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. 

ఎస్సీబీసీ కాలనీలో.. 
కంపెనీకి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామంలో సుమారుగా 480 ఇళ్లు ఉండగా 2 వేల మంది వరకు నివసిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీసులు నిత్యం ఇక్కడ పహారా కాస్తున్నారు. గ్రామానికి తిరిగి వస్తున్న వారిని పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. 

కంపరపాలెంలో.. 
కంపెనీకి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలో 250 ఇళ్లు ఉండగా 1,200 మంది నివసిస్తున్నారు. ఇళ్లకు చేరుకున్న కొందరు స్థానికులు ఆసక్తిగా టీవీలు చూస్తూ కనిపించారు. నిపుణుల బృందం ఇక్కడ కూడా నమూనాలను సేకరించింది. జీవీఎంసీ సిబ్బంది బ్లీచింగ్, స్ప్రేయింగ్‌ చేస్తున్నారు. 

నెల రోజులు ఉచిత వైద్య శిబిరాలు: మంత్రి ముత్తంశెట్టి
ఆదివారం ఆయా గ్రామాల్లో పర్యటించిన మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు  గ్రామస్తులతో మాట్లాడి ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అధికారులు చెప్పే వరకు ఇళ్లల్లో నివసించవద్దని సూచించారు. ఐదు గ్రామాల్లో నెల రోజుల పాటు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని హామీనిచ్చారు.  

కంపెనీని తరలించాలి..
‘ఎల్జీ పాలిమర్స్‌లో గతంలో ప్రమాదాలు జరిగినా పెద్దగా నష్టం జరిగేది కాదు. ఇప్పుడు ఏదైనా ప్రమాదం జరిగితే లక్షలాది మంది ఇబ్బందిపడే పరిస్థితి ఏర్పడింది. ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని కంపెనీని తరలించాలి. 
– ఎన్‌.శ్రీనివాసరెడ్డి, ఎస్సీబీసీ కాలనీ

నిపుణుల సూచనలు
► విష వాయువు ప్రభావిత గ్రామాల్లోని ఇళ్లలోకి వెళ్లే ముందు కొద్ది  గంటల పాటు తలుపులు తీసి ఉంచాలి.  
► బహిరంగంగా వదిలేసిన ఆహార దినుసులు, పదార్థాలు వాడకూడదు. 
► ప్యాకింగ్‌ చేసిన పదార్థాలను వినియోగించుకోవచ్చు.
► ట్యాంకుల్లో నీటిని ఖాళీ చేయాలి. పూర్తిగా శుభ్రం చేసిన తరువాతే మళ్లీ పట్టుకోవాలి. 

పోలీసులు వచ్చి మమ్మల్ని ఇళ్లు ఖాళీ చేయించారు. పునరావాస కేంద్రానికి తరలించారు. మూడు రోజుల పాటు అధికారులు చాలా బాగా చూసుకున్నారు. మా గ్రామంలో పరిస్థితి మెరుగుపడిందని తెలియడంతో ఆదివారం సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చేశాం.    
– డి.లక్ష్మి, కంపరపాలెం

‘చాలాకాలంగా కంపెనీలో క్యాజువల్‌ కార్మికుడిగా పనిచేస్తున్నా. 1998లో జరిగిన అగ్ని ప్రమాదం తరువాత ఇదే పెద్ద ఘటన. గురువారం నేను డ్యూటికి వెళ్లలేదు. గ్యాస్‌ వాసన రావడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేశాం. వెంటనే అధికారులు వచ్చి మమ్మల్ని పునరావాసానికి తరలించారు. అక్కడ అంతా బాగా చూసుకున్నారు. ఈ రోజు ఇంటి పరిస్థితి ఎలా ఉందో చూద్దామని వచ్చా’ 
– పి.శ్రీనివాసరెడ్డి, వెంకటాపురం,ఎల్జీ పాలిమర్స్‌ క్యాజువల్‌ కార్మికుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top