ఓ ప్రక్క సీమాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నా..నిమ్మకు నీరెత్తుకుండా బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్కు ఆర్టీసీ జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది.
అనంతపురం: ఓ ప్రక్క సీమాంధ్ర ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్నా..నిమ్మకు నీరెత్తుకుండా బస్సులను నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్కు ఆర్టీసీ జేఏసీ హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి సమ్మెను రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తామని ప్రకటించినా.. ప్రైవేటు బస్సులను తిప్పుతుండటంతో మండిపడింది. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ నడపరాదని జేఏసీ హెచ్చరికల నేపథ్యంలో.. బుధవారం నుంచి బస్సులను నిలిపివేస్తామని ప్రైవేటు బస్సుల యాజమాన్యాల సంఘాల నేత మునిరత్నం తెలిపారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె వల్ల సీమాంధ్ర 13 జిల్లాల్లోని 123 డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఏపీఎన్జీవోలతో పాటు అన్ని ప్రభుత్వ శాఖల్లోని నాలుగో తరగతి ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, డ్రైవర్లు సమ్మెలో ఉన్నారు. దీంతో ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోనుంది. ట్రెజరీ ఉద్యోగులు కూడా సమ్మెలో ఉండటంతో.. ప్రభుత్వ ఆర్థిక లావాదేవీల మీద తీవ్ర ప్రభావం పడుతుంది.