
రిమ్స్కు పంటి నొప్పి
దినదినాభివృద్ధి చెందాల్సిన రిమ్స్ దంతైవె ద్య కళాశాల తిరోగమనం దిశగా పయనిస్తోంది. దంతవైద్య విద్యార్థులకు కావాల్సిన వసతులున్నా ఖాళీల గండం వెంటాడుతోంది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు రూ.30 కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రమైన కడపలో దంతవైద్య కళాశాలను ఏర్పాటు చేశారు.
సాక్షి ప్రతినిధి, కడప: దినదినాభివృద్ధి చెందాల్సిన రిమ్స్ దంతైవె ద్య కళాశాల తిరోగమనం దిశగా పయనిస్తోంది. దంతవైద్య విద్యార్థులకు కావాల్సిన వసతులున్నా ఖాళీల గండం వెంటాడుతోంది.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సుమారు రూ.30 కోట్ల వ్యయంతో జిల్లా కేంద్రమైన కడపలో దంతవైద్య కళాశాలను ఏర్పాటు చేశారు.
ఆయన హయాంలో కళాశాలకు కావాల్సిన వసతులు, ప్రొఫెసర్లను సమకూర్చారు. 2008 జనవరి 21న జీఓ ఎంఎస్ నెంబర్ 21 ద్వారా దంత వైద్య కళాశాలకు సెమీ అటానమస్ హోదా కల్పించారు. దీంతో ప్రొఫెసర్ల కొరత లేకుండా పోయింది. అరకొర ఖాళీలను డెప్యూటేషన్ ద్వారా భర్తీచేసి డీసీఐ గుర్తింపు దక్కించుకున్నారు. ఇప్పటికి రెండు బ్యాచ్ల విద్యార్థులు దంతవైద్యులుగా వెళ్లారు. ఇలాంటి పరిస్థితుల్లో దంత వైద్య కళాశాలకు కొత్త సమస్య తలెత్తింది. రాష్ట్ర విభజన అంశం ఇందులో ముడిపడి ఉంది. పదవీకాలం ముగుస్తున్న ప్రొఫెసర్లకు రెన్యువల్స్ చేయకుండా నిరాకరిస్తున్నారు. ఆమేరకు డిపార్టుమెంట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
12 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీ....
దంత వైద్య కళాశాలలో ప్రస్తుతం 12 ప్రొఫెసర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రొఫెసర్లు, అసోషియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంటు ప్రొఫెసర్లు, ట్యూటర్లు మొత్తం 50మంది ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 38 మంది మాత్రమే ఉన్నారు. మరో మూడు రోజులకు ఒక ప్రొఫెసర్, ఒక అసోషియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పదవీ కాలం ముగియనుంది. ఆగస్టుకు ఈసంఖ్య 34కు చేరనుంది.
అప్పటికి ఆరుగురు ప్రొఫెసర్లు, 8మంది అసోషియేట్ ప్రొఫెసర్లు, 8మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 12మంది ట్యూటర్ల పదవీకాలం ముగియనుంది. కేవలం 16మందితో దంతవైద్య కళాశాల నెట్టుకురావాల్సిన దుస్థితి కళ్లెదుట కన్పిస్తోందని దంత వైద్య విద్యార్థులు వాపోతున్నారు. రెండురోజుల క్రితం దంతవైద్య కళాశాల డెరైక్టర్ డాక్టర్ బాలసుబ్రమణ్యం, ప్రొఫెసర్ డాక్టర్ నరేంద్ర పోస్టులను రెన్యువల్ చేశారు. డీఎంఈ ఎలాంటి అభ్యంతరం చెప్పలేకపోయింది. అంతలోనే మరో నలుగురికి రెన్యువల్స్ చేయాల్సి ఉండగా అందుకు డెరైక్టర్ నిరాకరించారు. డీఎంఈ మౌఖిక ఆదేశాల కారణంగా రెన్యువల్స్ చేపట్టలేదని వినిపిస్తుండటం గమనార్హం.
ఒక్కో కళాశాలలో ఒక్కో నిబంధన...
డీఎంఈ ఒక్కో కళాశాలలో ఒక్కొక్క నిబంధనను విధించడాన్ని దంత వైద్య విధ్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 40 మంది విద్యార్థులకు ఒక ప్రొఫెసర్, ఒక అసోషియేట్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ను నియమించారని వైద్యవర్గాలు దృవీకరిస్తున్నాయి. కడప దంత వైద్య కళాశాలలో వంద మంది విద్యార్థులకు కూడా ఆస్థాయిలో భర్తీలు లేవని, ఇదేక్కడి న్యాయమంటూ విద్యార్థులు వాపోతున్నారు. కొత్త పోస్టులు భర్తీ చేయకపోయినా ఉన్న పోస్టులను రెన్యువల్స్ చేయడంలో డీఎంఈ అశ్రద్ధ వహించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.