పట్టుకున్నారు కానీ.. | Rice mill not taken government license | Sakshi
Sakshi News home page

పట్టుకున్నారు కానీ..

Apr 24 2014 3:30 AM | Updated on Aug 20 2018 9:18 PM

ప్రభుత్వ అనుమతి కూడా పొందని రైసుమిల్లులో వేలాది బస్తాల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది.

బుచ్చిరెడ్డిపాళెం, న్యూస్‌లైన్ : ప్రభుత్వ అనుమతి కూడా పొందని రైసుమిల్లులో వేలాది బస్తాల ధాన్యాన్ని అక్రమంగా నిల్వ చేయడం జిల్లాలో కలకలం సృష్టిస్తోంది. మిల్లులోని ధాన్యం బస్తాల లెక్కింపునకు మూడు రోజులు పడుతుందని మొదట ప్రకటించిన విజిలెన్స్ అధికారులు, నాలుగు గంటలు గడవకముందే 73 వేల బస్తాలను లెక్కించామని ప్రకటించారు. అయితే బస్తాల లెక్కింపులో అనుమానాలు ఉన్నాయని, లోపల ఇంకా పెద్దసంఖ్యలో బస్తాలు ఉన్నాయని పరిసర ప్రాంతాల రైతులు ఆరోపిస్తున్నారు. బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి సమీపంలో ఉన్న శ్రీరాజరాజేశ్వరి రైసుమిల్లులో ఏడాదిగా ధాన్యం నిల్వ చేస్తున్నారు. అయితే ఈ నెల 19న మిల్లుకు లెసైన్స్ మంజూరు చేయాలని కోరుతూ యజమాని దరఖాస్తు చేసుకున్నారు.
 
 ఆ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని భావించిన సివిల్ సప్లయిస్ అధికారులు మంగళవారం రాత్రి విద్యుత్ సరఫరా లేని సమయంలో మిల్లును పరిశీలించేందుకు వచ్చారు. ఆ శాఖ డిప్యూటీ తహశీల్దార్ మల్లీశ్వరి మిల్లుకు వచ్చిన సమయంలో యజమాని లేరు. అప్పటికే బుచ్చిరెడ్డిపాళెంలోని రెండు రైసుమిల్లులపై విజిలెన్స్ అధికారులు దాడి చేసి రూ.80 లక్షల విలువైన నిల్వలను సీజ్ చేసిన విజిలెన్స్ అధికారులు శ్రీరాజరాజేశ్వరి మిల్లుకు వచ్చారు. యల్లాయపాళెం తదితర ప్రాంతాల నుంచి కొందరు రైతులు వచ్చి మిల్లులో తమ ధాన్యం కూడా ఉందంటూ రైతులు, విజిలెన్స్ అధికారులతో వాదనకు దిగారు.
 
 మాటమార్చిన విజిలెన్స్ డీఎస్పీ : మిల్లులోని బస్తాలను లెక్కించేందుకు మూడు రోజుల సమయం పడుతుందని మొదట విజిలెన్స్ డీఎస్పీ రమేష్‌బాబు విలేకరులకు తెలిపారు. మంగళవారం జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల దాడులు చేసి రూ.3 కోట్ల విలువైన ధాన్యాన్ని సీజ్ చేసి సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగించామని చెప్పారు. మళ్లీ ఆయనే సాయంత్రం విలేకరులతో మాట్లాడుతూ శ్రీరాజరాజేశ్వరి మిల్లులో ధాన్యం బస్తాల లెక్కింపు పూర్తయిందని ప్రకటించారు.
 
  సమొత్తం 28 వేల క్వింటాళ్ల బరువైన 73 వేల బస్తాలు ఉన్నాయని వెల్లడించారు. వీటి విలువ రూ.3.76 కోట్లకు పైగా ఉంటుందన్నారు. బస్తాల లెక్కింపుకు మూడు రోజుల సమయం పడుతుందని చెప్పిన నాలుగు గంటల్లోనే ఎలా లెక్కించారని ఓ విలేకరి ప్రశ్నించగా విజిలెన్స్ డీఎస్పీ రుసరుసలాడారు. డీఎస్పీ మాటమార్చడంతో విలేకరులు విజిలెన్స్ ఎస్పీ శశిధర్‌రాజును సంప్రదించారు. ఆయన మాట్లాడుతూ మిల్లులో అక్రమంగా ధాన్యం నిల్వ చేయడం నేరం కావడంతో సీజ్ చేసి సివిల్ సప్లయిస్ అధికారులకు అప్పగిస్తున్నామన్నారు. లెక్కింపు తదితరాలు ఆ శాఖ అధికారులు చూస్తారని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement