వంశధార, రెవెన్యూ అధికారులు గతంలో నిర్వాసితులకు నష్టం కలిగేలా సర్వేలు చేశారని అటువంటి వాటిని సరి చేయాలని పలువురు
శ్రీకాకుళం: వంశధార, రెవెన్యూ అధికారులు గతంలో నిర్వాసితులకు నష్టం కలిగేలా సర్వేలు చేశారని అటువంటి వాటిని సరి చేయాలని పలువురు నిర్వాసితులు డిమాండ్ చేశారు. జెడ్పీ సమావేశ మందిరంలో వంశధార నిర్వాసిత గ్రామప్రజలతో మంత్రి అచ్చెన్నాయుడు సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాడలి, తలగాం, దుగ్గుపురం గ్రామాలకు చెందిన పలువురు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించి అధికారులను వివరాలు కోరినప్పుడు నిర్వాసితులు చెప్పిన దానికి అధికారులు ఇచ్చిన వివరాలకు పొంతన లేకుండా పోయింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో రీసర్వే నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు అండగా ఉంటానని హామీనిచ్చారు. పాడలి గ్రామానికి సంబంధించి 471 మందికి పునరావాసం కల్పించాల్సి ఉందని తెలుసుకున్న మంత్రి తక్షణం వారికి పునరావాసం కల్పించాలని ఆదేశించారు. చిన సంకిలి గ్రామంలో సర్వే నిర్వహించి గతంలో జరిగిన లోపాలను సవరించి అందరికీ ఒకే మాదిరిగా పరిహారం అందేలా 20 శాతం వరకు అదనంగా కలిపి చెల్లిస్తామన్నారు. పశువులశాలలు తదితర కట్టడాలకు నష్టపరిహారం ఇవ్వడం జరగదని స్పష్టం చేశారు. చినసంకిలి గ్రామంలో 20 శాతం గృహాలకు అన్యాయం జరిగిందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకాలు ఉండరాదని చెప్పారు. ప్రాజెక్టు పనులకు నోటిఫ్ చేసిన తేదీ తరువాత ప్యాకేజీ ఇవ్వడం కష్టతరమని, కానీ ముఖ్యమంత్రితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. చిన్నజొన్నవలస కాలనీకి రహదారిని నిర్మించాలని ఆయన ఆదేశించారు.
వంశధారకు, విజయనగరం జిల్లాలో నాగావళిపైనున్న తోటపల్లి ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని చెప్పారు. కలెక్టర్ పి.లక్ష్మీనరసింహం మాట్లాడుతూ సర్వే చేసిన ప్రతీ గృహానికి ఒక స్టిక్కర్ను అతికించాలన్నారు. వంశధార పర్యవేక్షక ఇంజినీరు బి.రాంబాబు మాట్లాడుతూ హిరమండలం రిజర్వాయర్ పనులు 70 శాతం పూర్తయిందని చెప్పారు. వంశధార భూ సేకరణ అధికారి సీతారామారావు మాట్లాడుతూ ప్రాజెక్టుకు 11,422 ఎకరాల స్థలం సేకరించాల్సి ఉండగా, 11,271 ఎకరాలు సేకరించామన్నారు. 24 కేంద్రాల్లో పునరావాస కాలనీలకు ప్రతిపాదించామన్నారు. సమావేశంలో ఎంపీ రామ్మోహన్నాయుడు, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, జేసీ వివేక్ యాదవ్, నీటిపారుదల శాఖ సీఈ శివప్రసాద్, ఆర్డీవోలు దయానిధి, కె.సాల్మన్రాజు పాల్గొన్నారు.