శ్రీవారి సేవ మహద్భాగ్యం | Reseller mahadbhagyam | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవ మహద్భాగ్యం

Jul 17 2014 1:14 AM | Updated on Nov 9 2018 6:29 PM

శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యసేవల్లో పాల్గొనడం మహద్భాగ్యమని రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.

ఎంవీపీకాలనీ : శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యసేవల్లో పాల్గొనడం మహద్భాగ్యమని రాష్ట్ర మానవ వనరులు, విద్యాశాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. స్వర్ణభారతి ఇండోర్ స్డేడియంలో బుధవారం టీటీడీ నిర్వహించే వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు-2014, టోకెన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి సేవ టోకెన్‌ను ఆయన అందుకున్నారు.

అనంతరం మాట్లాడుతూ టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించే స్వామి నిత్య సేవల్లో విశాఖ వాసులు పాల్గొనాలని కోరారు. ఎంవీపీకాలనీలోని ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి అధ్యాత్మిక కేంద్రంగా చర్యలు తీసుకోవాలని టీటీడీ అధికారులకు సూచించారు. టీటీడీ జేఈవో పొలా భాస్కరరావు మాట్లాడుతూ ఈ నెల 21 నుంచి 29 వరకు తొలిసారిగా విశాఖలో వేంకటేశ్వరస్వామి వైభవోత్సవాలు జరుపుతున్నామన్నారు.

తొలి రెండు రోజులు చాగంటి కోటేశ్వరరావుచే తిరుమల వైభవంపై ప్రవచనాలు ఉంటాయన్నారు. 23 నుంచి 29 వరకు స్వామికి నిత్య కైంకర్యాలు వ్యాఖ్యాన సహితంగా జరుగుతాయని తెలిపారు. సుమారు ఎనిమిది వేల మందికి సేవలో పాల్గొనేందుకు ఉచితంగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు సేవల టోకెన్లు ఇస్తారన్నారు. ఉదయం 6 గంటలకు సుప్రభాతంతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో ముగుస్తుందన్నారు.

చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ విశాఖలో టీటీడీ అధికారులు విశాఖలో వేంకటేశ్వరుని వైభవోత్సవాలు జరపడం విశాఖ ప్రజ లకు వరం అన్నారు. ఆరోగ్యం, ఆర్థిక కారణాలతో శ్రీవారిని దర్శించుకోలేని వారికి ఇక్కడే ఆ భాగ్యం దక్కుతుందని చెప్పారు. కార్యక్రమం లో ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు, జీవి యంసీ సీఈ బి.జయరామిరెడ్డి, టీటీడీ స్పెషలాఫీసర్ రఘనాథ్, సూపరింటెండెంట్ వెంకటరమణ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement