పత్తి రేటు పడిపోతోంది
తేమశాతం ఉందంటూ వెనక్కు పంపుతున్న సీసీఐ
పదిరోజులైనా కేజీ పత్తి కొన ని వైనం
బయట మార్కెట్లో రేటు తగ్గించిన వ్యాపారులు
వారంలో రూ.300 తగ్గిన పత్తి ధర
ఆందోళనలో అన్నదాతలు
పత్తి రేటు పడిపోతోంది. వారం కిందట క్విటా రూ.3,800 పలికిన పత్తి ధర ఇప్పుడు రూ.300 తగ్గింది. సీసీఐ కేంద్రాలను ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. బయ్యర్లు ముందు రాకపోవడం, వచ్చినా తేమ శాతం తగ్గిందనే సాకు చూపి కొనుగోలు చేయకపోవడంతో రైతులు వెనుతిరుగుతున్నారు. ఇప్పుడు దళారులు ప్రవేశించి అయినకాడికి సొమ్ము చేసుకుంటున్నారు. రైతులు నష్టపోతున్నా వ్యవసాయ శాఖామంత్రి స్పందించకపోవడంపై
విమర్మలు వినిపిస్తున్నాయి.
నరసరావుపేటరూరల్ నరసరావుపేట వ్వవసాయ మార్కెట్ యార్డులో ఈనెల 3వ తేదీన సీసీఐ పత్తి కోనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. బయ్యర్లకు మిల్లులు కేటాయించకపోవడంతో రెండ్రోజుల తర్వాత కోనుగోలు చేస్తామని ప్రకటించారు. ఆ తర్వాత పలు గ్రామాల నుంచి రైతులు తీసుకువచ్చిన పత్తిని పరిశీలించిన బయ్యర్లు తేమశాతం ఎక్కువుగా ఉందంటూ వెనక్కు పంపారు. గిట్టుబాటు ధర వస్తుందని ఆశతో వచ్చిన రైతులకు నిరాశతో వెనుతిరిగారు. ఏఏ రోజుల్లో కేంద్రానికి రానున్నామో బయ్యర్లు ఇప్పటివరకు ప్రకటించలేదు. అసలు వస్తారో, రారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఒక్క కేజీ పత్తి కూడా ఈ కేంద్రంలో కొనుగోలు జరగలేదు. దీంతో ఈ సీజన్లో పత్తితో నిండి ఉండాల్సిన మార్కెట్ బోసిపోయి కనిపిస్తోంది.
తగ్గిన ధరలు..
వారం క్రితం వరకు పత్తి వ్యాపారులు గ్రామాల్లో క్వింటా రూ.3,800 వరకు కొనుగోలు చేశారు. తేమశాతం పేరుతో మార్కెట్ యార్డులో బయ్యర్లు పత్తిని వెనక్కు పంపడంతో గ్రామాల్లో వ్యాపారులు రేటు తగ్గించారు. ప్రస్తుతం గ్రామాల్లో క్వింటా రూ.3,500 నుంచి రూ.3,600 వరకు కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే పెట్టుబడులు కూడా రావని ఆందోళనలో ఉన్న అన్నదాతలకు గిట్టుబాటు ధర లేకపోవడం భారంగా మారింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.