
రత్నాచల్కు మరమ్మతులు చేస్తున్న రైల్వే సిబ్బంది
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం సిటీ: విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఏసీ కోచ్ కింద బాలిస్టర్ స్ప్రింగ్ విరిగి పోవడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్లో రెండు గంటల పాటు నిలిచిపోయింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు మొదటి ప్లాట్ఫాంపైకి వస్తుండగా టీఎక్సార్ డిపార్ట్మెంట్ వారు ఏసీ కోచ్ నంబర్ సీ–2 కింద స్ప్రింగ్ విరిగి ఉండటాన్ని గుర్తించారు. తక్షణమే అప్రమత్తమైన అధికారులు రైలును రెండో నంబర్ ప్లాట్ఫాంపైకి తరలించి విరిగిన స్ప్రింగ్ స్థానంలో కొత్తది వేసి రైలును విజయవాడ పంపించారు. ఈ బాలిస్టర్ స్ప్రింగ్ మార్చేందుకు రెండు గంటల సమయం పట్టడంతో సాయంత్రం 6 గంటల సమయంలో రైలు విజయవాడకు బయలు దేరింది.