ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవహించాయి. దీని ప్రభావంవల్ల వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాన్ని క్యుములోనింబస్ మేఘాలు ఆవహించాయి. దీని ప్రభావంవల్ల వచ్చే 48 గంటల్లో ఉత్తర కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. క్యుములోనింబస్ మేఘాలవల్ల గత రెండు రోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయని, ఇప్పుడు వీటి దిశ మారడంవల్ల ఉత్తర కోస్తా, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రుతు పవనాలు ప్రవేశానికి ముందు మే నెలలో వర్షాలు కురవడం సాధారణమేనని, ఇప్పుడు కూడా అలాంటి వానలే కురుస్తున్నాయని వాతావరణ శాఖ రిటైర్డు అధికారి మురళీకృష్ణ తెలిపారు. ప్రస్తుతం గాలిలో తేమ అధికంగా ఉండటంవల్ల ఉక్కపోత ఎక్కువగా ఉందని, ఈ నెలాఖరు వరకూ 40 నుంచి 44 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని పేర్కొన్నారు. ‘ఈ ఏడాది 95 శాతం వరకూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఇది దేశం మొత్తానికి సంబంధించిన అంచనా. రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. దక్షిణాది ప్రాంతంలో ఎంతమేరకు వర్షాలు కురుస్తాయో కూడా ఇప్పుడు చెప్పలేం. జూన్లో ఈ ప్రాంతంలోకి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ఈ ఏడాది దక్షిణాదిలో వర్షపాతం ఎంత మేరకు ఉంటుందో అంచనా వేయడానికి వీలవుతుంది’ అని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ‘సాక్షి’కి తెలిపారు.