‘సీమాంధ్రలోకి ముంపు గ్రామాల’పై...నిరసన వెల్లువ | protests on caved villages in seemandhra | Sakshi
Sakshi News home page

‘సీమాంధ్రలోకి ముంపు గ్రామాల’పై...నిరసన వెల్లువ

Feb 17 2014 1:56 AM | Updated on Jun 4 2019 6:28 PM

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు.

 కేంద్రం దిష్టిబొమ్మ దహనం
 కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను స్థానిక అంబేద్కర్ సెంటర్‌లో సీపీఐ, దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి, సీపీఐ డివిజన్ కార్యదర్శివర్గ సభ్యుడు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్ట్ కింద గ్రామాల ముంపునకు ముందు అంగీకరించి, ఇప్పుడు వీల్లేదంటూ మొసలి కన్నీరు కారుస్తున్న ప్రజాద్రోహులను ఏజెన్సీ ప్రజలు క్షమించరని అన్నారు. ఆదివాసీ గ్రామాలను సీమాంధ్రలో కలిపితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో నాయకులు సునీల్ కుమార్, కోలా రాజు, బల్లా సాయికుమార్, ఎస్‌విఎస్.నాయుడు, వి.దుర్గారావు, సురేష్ నాయుడు, నవీన్, మంతోజు, గోపి, జయకర్, విక్రమ్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.
 
 చెవిలో పువ్వులతో సీపీఎం ప్రదర్శన
 పోలవరం ముంపు గ్రామాల ప్రజల చెవుల్లో స్థానిక ఎంపీ, ఎమ్యెల్యేలు పువ్వులు పెట్టి మోసగించారని ఆరోపిస్తూ సీపీఎం నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఇక్కడ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకుడు, మాజీ ఎమ్యెల్యే కుంజా బొజ్జి మాట్లాడుతూ.. వేల కోట్ల రూపాయలతో ఏజెన్సీలో విద్య, వైద్య, వ్యాపార రంగాల అభివృద్ధి జరిగిందని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో ఈ అభివృద్ధంతా జల సమాధి అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవేవీ పట్టించుకోకుండా స్థానిక ఎంపీ, ఎమ్యెల్యేలు పైరవీలతో కాలం గడుపుతున్నారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో నాయకులు ఎంబి.నర్సారెడ్డి, బి.వెంకటరెడ్డి, ప్రతాప్‌కుమార్, గిరి ప్రసాద్, మాధవరావు, నాగరాజు, శివాజీ, లీలావతి, జ్యోతి, గంగ తదితరులు పాల్గొన్నారు.
 
 టీడీపీ రిలే దీక్షలు
 స్థానిక బస్టాండ్ ఎదుట టీడీపీ ప్రారంభించిన రిలే దీక్షలు ఆదివారం రెండోరోజుకు చేరాయి. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొమరం ఫణీశ్వరమ్మ మాట్లాడుతూ... భద్రాచలం నియోజకవర్గాన్ని గోదావరిలో నిండా ముంచిన పాపం యూపీఏ అధ్యక్షరాలు సోనియా గాంధీదేనని విమర్శించారు. ముంపు గ్రామాలను సీమాంధ్రకు వదిలేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలలో ఆమెతోపాటు పార్టీ నాయకులు అన్నెం వెంకటేశ్వరరావు, అక్కల శ్రీనివాస్, గొర్ల రామకృష్ణ, అక్కల జ్యోతి, జయరాజు, రవి, లక్ష్మి కూర్చున్నారు. శిబిరాన్ని టీడీపీ నాయకులు కుంచాల రాజారాం, కొడాలి శ్రీనివాస్, వట్టికొండ రాము, కోనేరు రాము, ఆలీ పాష తదితరులు సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement