
సాక్షి, బి.కొత్తకోట(చిత్తూరు) : స్థానిక సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ వీజీకే నాయుడు మంగళవారం నీటిపై ఆసనాలు వేసి, అబ్బురపరిచారు. సోమవారం రాత్రి భారీ వర్షాలు కురవడంతో విద్యాలయ ఆవరణలోని కుంటలు నిండాయి. ప్రిన్సిపాల్ నీటిపై ఆసనాలు వేస్తారని తెలుసుకున్న విద్యార్థులు విన్యాసాలు ప్రదర్శించాలని విన్నవించగా ఆయన అంగీకరించారు.
గతంలో కృష్ణానదిలో ఆసనాలు వేసిన ఆయన ఇక్కడికి కుంటలోనూ ఆసనాలు వేసి ఆశ్చర్యపరిచారు. నిద్రాసనం, శవాసనం, పూర్ణాసనం, వజ్రాసనం, కూర్మాసనం, కలైరాసనం, దర్వాసనం, అధోముఖాసనం, సూర్యనమస్కారాసనం, కత్తిరాసనం తదితర ఆసనాలను వేశారు. చివర్లో చేతిలో కర్పూరం వెలిగించిన మట్టి తట్టను నీటిలో తడవకుండా చేతిలో పెట్టుకుని ఆసనం వేశారు. ఆయన నీటిలో వేసిన ఆసనాలను తిలకించిన విద్యార్థులు, అధ్యాపకులు ప్రిన్సిపాల్ ప్రతిభకు చపట్లు కొట్టి, అభినందించారు.