విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌.. కేంద్రం కీలక ప్రకటన

Piyush Goyal Announced Vizag Railway Zone - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వే జోన్‌కు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. విశాఖ కేంద్రంలో నూతన రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ అధికారికంగా ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని షెడ్యూల్‌ 13 ఎనిమిదో ఆర్టికల్‌ ప్రకారం విశాఖ కేంద్రంగా సౌత్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. గుంటూరు, విజయవాడ, గుంతకుల్లు డివిజన్లతో నూతన జోన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతమున్న వాల్తేరు డివిజన్‌ను రెండు భాగాలుగా విభజించనున్నారు. పూర్తి వివరాలను రైల్వేశాఖ అధికారులతో చర్చించిన అనంతరం వెల్లడిస్తామని గోయల్‌ తెలిపారు.

టాస్క్‌ఫోర్స్‌ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న కేంద్రం ఈమేరకు రైల్వేజోన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 1న విశాఖ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో రెండురోజుల ముందు కేంద్ర ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. కాగా విశాఖ రైల్వే జోన్‌ ప్రకటనతో ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కోరికను కేంద్ర ప్రభుత్వం తీర్చినట్లయ్యింది. కాగా గత నాలుగేళ్లుగా విశాఖ రైల్వేజోన్‌ కోసం వైఎస్సార్‌సీపీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే.

ఫలించిన వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పోరాటం..
ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలో పేర్కొన్న విధంగా ఏపీకి ప్రత్యేక హోదాను ఇవ్వాలనీ, విశాఖ కేంద్రంగా రైల్వేజోన్‌ను ఏర్పాటు చేయాలని ఏపీ ‍ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన పోరాటానికి ఎట్టకేలకు ఫలితం దక్కింది.  వీటీపై ఆయన పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీని కలిసి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఏపీ కేంద్రంగా వైఎస్సార్‌సీపీ అనేక ఉద్యమాలను చేపట్టింది. పార్లమెంట్‌ వేదికగా పార్టీ ఎంపీలు చేసిన కృషికి ఫలితంగా.. విశాఖ రైల్వే జోన్‌ ప్రకటిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జోన్‌ ప్రకటనపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top