
సాక్షి, అమరావతి : దేశ చరిత్రలో తొలిసారిగా సామాజిక పింఛన్లను రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయనుంది. అదికూడా ఫిబ్రవరి 1వ తేదీనే ఈ ప్రక్రియ మొత్తాన్ని కేవలం కొద్దిగంటల్లోనే పూర్తిచేయడానికి సర్కారు అన్ని ఏర్పాట్లుచేసింది. అర్హులైన కొత్త వారికి కూడా జనవరి నెల నుంచి పింఛన్లను మంజూరు చేసింది. ఫిబ్రవరి 1న రాష్ట్రవ్యాప్తంగా 54.65 లక్షల మందికి పైగా వృద్ధులు, వితంతు, దివ్యాంగులు తదితరులకు గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా వారి ఇంటి వద్దే వీటిని ఇవ్వనుంది. ఇందుకోసం రూ.1,320.14 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
సామాజిక పింఛనన్లు పొందుతున్న వారందరూ కూడా పేదలే అయినందున.. రిటైర్డ్ ప్రభుత్వోద్యోగులు అందుకున్నట్లుగానే వీరికి కూడా ప్రతినెలా 1వ తేదీనే పింఛన్ను అందజేయాలని సర్కారు సంకల్పించింది. ఇందుకు అత్యధిక ప్రాధాన్యతనూ ఇస్తోంది. మరోవైపు.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నాణ్యమైన బియ్యాన్ని ప్యాకెట్ల రూపంలో ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే దీనిని శ్రీకాకుళం జిల్లాలో అమలుచేస్తున్న విషయం తెలిసిందే.
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు పింఛన్ల పంపిణీ
కాగా, శనివారం ఉ.8 గంటల నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇది మ.1 గంటకల్లా పూర్తిచేసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పేరుతో బ్యాంకు ఖాతాలను తెరిచి పింఛన్ల మొత్తాలను వారి ఖాతాల్లో జమచేశారు. వలంటీర్లకు ఆ డబ్బులను శుక్రవారం మధ్యాహ్నానికల్లా అందజేయనునున్నారు.