లేకపోతే అమెరికాను మించిపోతాము | Peddireddy Ramachandra Reddy Meeting With Chittoor Task Force Over Coronavirus | Sakshi
Sakshi News home page

బార్డర్లు కూడా లాక్‌ చెయ్యాలి: పెద్దిరెడ్డి

Apr 1 2020 2:45 PM | Updated on Apr 1 2020 3:09 PM

Peddireddy Ramachandra Reddy Meeting With Chittoor Task Force Over Coronavirus - Sakshi

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

సాక్షి, చిత్తూరు : జిల్లాలో నిన్నటి వరకు ఒకే ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు ఉండిందని, కొత్తగా మరో ఐదుగురికి పాజిటివ్‌ రావటంతో ఆ సంఖ్య ఆరుకు చేరిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పాజిటివ్‌ కేసులలో ఢిల్లీ, చెన్నై నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని, క్వారంటైన్‌లో ఉన్నవారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితుల కోసం డాక్టర్లు 24 గంటలు పని చేస్తున్నారని చెప్పారు. పోలీసులు కూడా బార్డర్లు లాక్‌ చెయ్యాలని సూచించారు. జిల్లాలో ఎవరూకూడా తప్పించుకుని తిరగాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. వాలంటీర్లు కూడా కొత్త వ్యక్తులు ఊర్లోకి వస్తే వెంటనే సమాచారం అందించాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కరోనా వైరస్‌ మహమ్మారిని తరిమికొట్టడానికి కృషి చేస్తున్నారని కొనియాడారు. మారోమారు కరోనాపై టాస్క్‌ ఫోర్స్‌ మీటింగ్‌ నిర్వహిస్తామని చెప్పారు.  

లేకపోతే అమెరికాను మించిపోతాము
కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ప్రజలు సహకరించాలని, లేకపోతే అమెరికాను మించిపోతామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి హెచ్చరించారు. మైనారిటీలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇండియాలో తక్కువ కేసులు నమోదు అవుతున్నాయని, నేడు ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిపోయిందని తెలిపారు. కరోనా వైరస్‌కి మెడిసిన్ లేదని, స్వీయ నియంత్రణే మార్గమని చెప్పారు. అన్ని మతాల వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement