నదీజలాల్లో ఆక్సిజన్‌ అదృశ్యం | Oxygen That Disappears Due To Industrial Pollution | Sakshi
Sakshi News home page

నదీజలాల్లో ఆక్సిజన్‌ అదృశ్యం

Dec 16 2019 3:31 AM | Updated on Dec 16 2019 3:31 AM

Oxygen That Disappears Due To Industrial Pollution - Sakshi

సాక్షి, అమరావతి:  మన దేశ నదీ జలాల్లోని ఆక్సిజన్‌ లభ్యతలో పెనుమార్పులు చోటుచేసుకుంటున్నాయా? కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాలు, అధిక ఉష్ణోగ్రతల వల్ల నదుల్లోని ఆక్సిజన్‌ శాతం తగ్గి అందులోని జలచరాల ఉనికికి ముప్పు ఏర్పడుతుందా? కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తాజా నివేదికల ప్రకారం ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. పరిశ్రమల నుంచి విడుదలయ్యే కాలుష్యం, మురుగునీటిని నదుల్లోకి యథేచ్ఛగా వదిలేయడం.. ఇష్టారాజ్యంగా గనులు తవ్వకం, గ్లోబల్‌ వారి్మంగ్‌ వల్ల అవి కాలుష్య కాసారాలుగా మారాయని.. దాంతో నదీజలాల్లో ఆక్సిజన్‌ లభ్యత తగ్గిపోతుందని వెల్లడైంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే దేశ ప్రజల సామాజిక, ఆర్థిక అభివృద్ధి, ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతుందని సీడబ్ల్యూసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

13 నదుల్లో ఆక్సిజన్‌ లభ్యతపై పరీక్షలు
దేశంలోని నదీ జలాల్లో రోజురోజుకు మత్స్యసంపద తగ్గిపోవడానికి గల కారణాలు అన్వేషించాలని జీవశాస్త్రవేత్తలు చేసిన సూచన మేరకు సీడబ్ల్యూసీ ఈ అధ్యయనం నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకర విషయాలు వెల్లడయ్యాయి. కాలుష్యం, భూతాపం వల్ల నదుల్లో ఆక్సిజన్‌ తగ్గిపోతుందని, తక్షణం కాలుష్యానికి అడ్డుకట్ట వేసి జీవావరణ (ఎకాలజీ) సమతుల్యతను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల ప్రభుత్వానికి నివేదిక అందచేసింది. హిమాలయ నదులు, ద్వీపకల్ప నదులు కలిపి మొత్తం 13 నదుల్లోని 19 ప్రాంతాల్లో మూడు కాలాల్లో రోజూ మూడు గంటలకోసారి నీటిని సేకరించి డీఓ(నీటిలో కరిగిన ఆక్సిజన్‌) శాతాన్ని సీడబ్ల్యూసీ లెక్కగట్టింది.  

డీఓ తగ్గినా.. పెరిగినా ముప్పే
డీఓ పరిమాణం 1 నుంచి 2 మిల్లీగ్రాముల మధ్య ఉంటే చేపలు చనిపోతాయి. 7 మిల్లీగ్రాములు అంతకంటే ఎక్కువ డీఓ ఉంటే ఆ నదుల్లో చేపల పునరుత్పత్తి్త గణనీయంగా తగ్గిపోతుంది. నదీజలాల్లో డీఓ శాతం 1 మిల్లీగ్రాము కంటే తగ్గితే బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందుతుంది. నాచు(ఆల్గే), గుర్రపుడెక్క వంటి నీటి మొక్కలు ఎక్కువగా పెరిగి నది జీవావరణం దెబ్బతింటుంది. దీంతోచేపల మనుగడ ప్రశ్నార్థకమవుతుంది.  

సీడబ్ల్యూసీ అధ్యయనంలో వెల్లడైన అంశాలు
►హిమాలయాల్లో జన్మించి ఉత్తరాది రాష్ట్రాల్ని సస్యశ్యామలం చేసే గంగ, యమునా, బ్రహ్మపుత్ర తదితర నదులు కాలుష్య కాసారాలుగా మారాయి. ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా జలాల్లో ఆక్సిజన్‌ లభ్యత దాదాపుగా లేదు. అన్ని కాలాల్లో ఏ రోజూ కూడా అక్కడ ఆక్సిజన్‌ ఉనికి కని్పంచలేదు. యమునలో ఒకటీ అరా చేపలు కూడా కానరాలేదు.  

►గంగా నదిలో వారణాసి వద్ద లీటర్‌ నీటిలో కనిష్టంగా 6.12 మిల్లీ గ్రాములు.. గరిష్ఠంగా 9.14 మిల్లీగ్రాముల డీఓ ఉంది. గాం«దీఘాట్‌ వద్ద గంగలో లీటర్‌ నీటిలో కనిష్టంగా 5.24 మి.గ్రా., గరిష్టంగా 7.95 మి.గ్రా.ల డీఓ ఉంది. నమామి గంగలో భాగంగా నది ప్రక్షాళనతో కాలుష్య ప్రభావం క్రమేణా తగ్గుతుంది.  

►తుంగభద్ర నదిలో మంత్రాలయం వద్ద లీటర్‌ నీటిలో కనిష్టం 5.20, గరిష్టం 9.60 మిల్లీగ్రాముల ఆక్సిజన్‌ లభిస్తోంది. మహారాష్ట్రలోని పుల్‌గావ్‌ వద్ద భీమా నదిలో కనిష్టంగా 6.20 మి.గ్రా., గరిష్టంగా 10.90 మి.గ్రాముల డీఓ ఉంది.  

►హిమాలయ నదుల కంటే మధ్య, దక్షిణ భారతదేశంలోని నదుల్లో ఆక్సిజన్‌ లభ్యత మెరుగ్గా ఉంది. ద్వీపకల్ప నదుల్లోనూ ఆక్సిజన్‌ లభ్యతలో ఎప్పటికప్పుడు మార్పుల వల్ల మత్స్యసంపద వృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతోంది.

►కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల ప్రకారం లీటర్‌ నీటిని శుద్ధి చేయక ముందు.. డీఓ ఆరు మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఉంటేనే వాటిని తాగునీటి కోసం వినియోగించవచ్చు. ఐదు మిల్లీగ్రాముల కంటే డీఓ ఎక్కువ ఉంటే వాటిని స్నానానికి వాడొచ్చు. శుద్ధి చేసిన తర్వాత డీఓ శాతం నాలుగుగా ఉంటే ఆ నీటిని తాగొచ్చు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement